
తెలంగాణ సర్కారు రాఖీ పండగను వినూత్నంగా నిర్వహించనుంది. బేటి బచావో -బేటి పడావో అన్న కేంద్ర ప్రభుత్వ నినాదాన్ని భారీ ఎత్తున ప్రచారం చేయడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బాలికలను బ్రతికించండి - బాలికలను చదివించండి అంటూ బాలికల రక్షణతో పాటు, విద్యాభివృద్దికి పూనుకుంది తెలంగాణ సర్కారు.
హైదరాబాద్ జిల్లాలో దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం చిన్నారుల చేత ప్రముఖులకు రాఖీలు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాలోని కార్పొరేటర్ ను మొదలుకుని గవర్నర్ వరకు అందరికి రాఖీలను కట్టబోతున్నారు. ఇందుకు జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ తగు ఏర్పాట్లు చేస్తోంది.
ఒకేరోజు 25 వేల రాఖీలను చిన్నారులచేత ప్రముఖులకు,అధికారులకు కట్టించనున్నట్లు జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జీకే సునంద తెలిపారు. బేటి బచావో -బేటి పడావో కార్యక్రమం ద్వారా జిల్లాలో లింగ నిష్పత్తిని పెంచడం కోసం అధికారులంతా కృషి చేయాలని ఆదేశించారు.