
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారిస్తున్న నేపథ్యంలో.. ఆ పార్టీ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చేవరకు నిరసన ప్రదర్శనల చేపట్టనుంది. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతివ్వడంతో.. నెక్లెస్ రోడ్డు నుంచి బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వరకు కాంగ్రెస్ నాయకులు సత్యాగ్రహ మార్చ్ చేపట్టారు. ఈ ర్యాలీలో టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో పాటుగా ఇతర ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండాలు చేతపట్టుకుని.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇక, బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు.. రోడ్డుపైనే బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తుందని టీ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ ఇలాంటి చర్యలు మానుకోవాలని లేకుంటే.. పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబంపై ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారంటే.. బీజేపీ ఎంత కక్ష పూరితంగా వ్యవరిస్తుందో తెలుస్తుందని అన్నారు. ఈడీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని తెలిపారు.
ఇక, ప్రస్తుతం ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు ఉన్నతాధికారులు రాహుల్ గాంధీ వాంగ్మూలం నమోదు చేయనున్నట్టుగా తెలుస్తోంది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ హోదా అధికారి ప్రశ్నలు అడుగుతారని.. డిప్యూటీ డైరెక్టర్ హోదా అధికారి విచారణను పర్యవేక్షిస్తున్నట్టుగా సమాచారం. మరో అధికారి రాహుల్ గాంధీ సమాధానాలను టైప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక, రాహుల్ను ఈడీ విచారిస్తున్న నేపథ్యంలో.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నిరసలు చేపట్టింది. ఢిల్లీలో పలువురు ముఖ్య నేతలతో పాటుగా, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలను పోలసులు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడిన కాంగ్రెస్ కార్యకర్తలను ప్రియాంక గాంధీ కలిశారు.