
ఖమ్మం: తెలంగాణలో మహిళల పరిస్థితి ఎలా వుందో తెలియజేసే సంఘటన ఖమ్మం జిల్లాలో ఇటీవల వెలుగుచూసింది. భర్త, సోదరుడి కళ్లముందే భుజాన బిడ్డతో వెళుతున్న గర్భిణిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు దిగిన ఘటన గతవారం చోటుచేసుకుంది. బైక్ పై వెళుతున్న గర్భిణితో అసభ్యంగా ప్రవర్తిస్తూ... ఆమె భర్త, సోదరుడిని బెదిరించి దాడికి యత్నించిన నిందితులను గుర్తించినట్లు ఖమ్మం ఏసిపి బస్వారెడ్డి వెల్లడించారు.
గత గురువారం రఘునాథపల్లె మండలం జాన్బాద్తండాకు చెందిన గర్భిణిని అర్ధరాత్రి వేధించిన 11మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నట్లు ఏసిపి తెలిపారు. వీరిలో ఐదుగురు మైనర్లు కూడా వున్నట్లు వెల్లడించారు. నిందితులపై ఐపీసీ 143, 341, 354, 354డీ, 149, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసామని ఏసిపి బస్వారెడ్డి తెలిపారు.
అసలేం జరిగిందంటే:
ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం జాన్బాద్తండాకు చెందిన మహిళ భర్త, బిడ్డతో కలిసి హైదరాబాద్ లో నివాసముంటోంది. ప్రస్తుతం ఆమె గర్భంతో వుంది. అయితే స్వగ్రామంలో బోనాల పండగ వుండటంతో పుట్టింటికి రావాలని కూతురిని తల్లిదండ్రులు పిలిచారు. దీంతో గత గురువారం (జూన్ 9వ తేదీన) భర్త, బిడ్డతో కలిసి ఆర్టిసి బస్సులో ఆమె ఖమ్మం చేరుకుంది. అప్పటికే అర్థరాత్రి కావడంతో వీరిని రిసీవ్ చేసుకోడానికి గర్భిణి మహిళ సోదరుడు బస్టాండ్ కు వచ్చాడు.
సోదరుడి బైక్ పై గర్భిణి మహిళ, ఆమె భర్త, కుమారుడు జాన్బాద్తండాకు బయలుదేరారు. ఇలా వెళుతుండగా మార్గమధ్యలో రాయన్నపేట సమీపానికి రాగానే వీరిని కొందరు ఆకతాయిలు బైక్ లపై వీరిని వెంబడించడం ప్రారంభించారు. గర్భిణి, ఓ బిడ్డకు తల్లి అనికూడా చూడకుండా భర్త, సోదరుడు వుండగానే మహిళను వేధించడం ప్రారంభించారు. మహిళను తమవద్ద వదిలిపెట్టి వెళ్లాలంటూ చాలా అసభ్యంగా మాట్లాడారు. దాదాపు 15కిలోమీటర్లు ఇలాగే వీరి బైక్ ను చుట్టుముట్టి మహిళను వేధించారు.
స్వగ్రామం జాన్బాద్తండాకు వచ్చిన తర్వాత కూడా ఆకతాయిలు మహిళను వదిలిపెట్టలేదు. దీంతో గ్రామస్తులంతా గుమిగూడి ఆకతాయిలను వెంబడించడంతో వారు బైక్స్ ను అక్కడే వదిలిపెట్టి పరారయ్యాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండుగులు వదిలివెళ్లిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బైక్ నెంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులంగా ఖమ్మం లోని రేవతిసెంటర్ ఎన్ఎస్టీ రోడ్డుకు చెందిన వారిగా గుర్తించామని ఏసీపీ బస్వారెడ్డి తెలిపారు. 11 మంది నిందితుల్లో మైనర్లు ఐదురుగు వుండగా వారిని జువైనల్ హోంకు తరలించినట్లు... మిగతావారిని రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి తెలిపారు.