
జగిత్యాల: దివంగత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత రత్న బిరుదు ఇవ్వాలని తెలంగాణ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు వైఎస్సార్ కి భారతరత్న బిరుదు ప్రకటించేలా భారత ప్రభుత్వాన్ని ఒప్పించాలని జీవన్ రెడ్డి కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ 72వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో వైఎస్సార్ కు నివాళులర్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేశారు.
read more ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా నాన్నా!: వైఎస్సార్ జయంతిన జగన్ భావోద్వేగం
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ... తెలుగు జాతికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు వైఎస్సార్ అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలకు బాటవేసిన మహా నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు.
''చరిత్రపుటల్లో లిఖించదగ్గ పేరు ఆ మహానాయకుడు వైయస్సార్ ది. నేడు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆద్యుడు, అంకురార్పణ చేసింది వైఎస్సార్. కాబట్టి భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి భారతరత్న బిరుదునిచ్చి గౌరవించాలి'' అని జీవన్ రెడ్డి సూచించారు.