
తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను కలిసింది. సోమేష్ కుమార్ను కలిసినవారిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. ధరణిని రద్దు చేసి పాత పద్దతిని తీసుకురావాలని సీఎస్ను కాంగ్రెస్ నేతల బృందం కోరింది. పోడు భూముల సమస్యలను పరిష్కారించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీఎస్కు కాంగ్రెస్ నేతల బృందం వినతిపత్రం అందజేసింది. అంతకుముందు ఈరోజు ఉదయం సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు.
ఇదిలా ఉంటే.. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు టీ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది. పోడు భూములు, ధాన్యం సేకరణ సమస్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకి రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు, ధరణి పోర్టల్, పోడు భూముల సమస్యలతో వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించేలా ఆలోచించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతారని, రైతు సమస్యలపై దశలవారీగా నిరసనలు చేపట్టాలని పార్టీ యోచిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే రైతు సమస్యలపై టీ కాంగ్రెస్ నేతల బృందం నేడు సీఎస్ సోమేష్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేసింది.