
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, తన సతీమణి శోభ, కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా తీవ్ర పంటినొప్పితో బాధపడుతున్న కేసీఆర్ పంటికి సోమవారం శస్త్రచికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వైద్యుడికి సంబంధించిన ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో దంత పూర్తిగా దెబ్బతీయడంతో కేసీఆర్కు శస్త్రచికిత్స చేసి ఓ దంతాన్ని తొలగించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
శస్త్రచికిత్స సమయంలో అనస్తీషియా ఇవ్వడంతో కేసీఆర్ రోజంతా విశ్రాంతిలోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండ్రోజులపాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతంసీఎం కేసీఆర్ ఢిల్లీ తుగ్లక్రోడ్డులోని తన నివాసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పలువురు ఎంపీలు, నాయకులు ఆయనను కలువడానికి వచ్చిన విశ్రాంతిలో ఉండటంతో కలవలేక వెళ్లిపోయారట. అలాగే.. సీఎం కేసీఆర్ తన సతీమణి శోభ కూడా వైద్య పరీక్షలు చేయించుకోనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే.. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే డిమాండ్తో ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నాను తలపెట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రంపై పోరాడిన ఉత్తరాదికి చెందిన రైతు సంఘాల ముఖ్య నాయకులను ఈ ధర్నాకు ఆహ్వానించాలని సీఎం యోచిస్తున్నారట. తెలంగాణ ఏర్పాడిన తర్వాత ఢిల్లీలో టీఆర్ఎస్ చేపట్టిన తొలి నిరసన ర్యాలీ కాబట్టి పెద్ద ఎత్తున కరాత్తులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని “గ్రాండ్ సక్సెస్” చేసేందుకు జాతీయ నాయకులతో పాటు.. రైతు సంఘాల నేతలతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. అయితే, ఏప్రిల్ 11న ఢిల్లీలో జరిగే ధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేదా? అన్నదానిపై ఆయన స్పష్టత రాలేదు. ఈ తరుణంలోనే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు), సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెఎం) వంటి రైతు సంఘాల నాయకులతో పాటు ప్రాంతీయ పార్టీల నాయకులను ఆహ్వానించే యోచనలపై సిఎం ఎంపిలతో చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు సహా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దాదాపు 10 వేల మంది టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ధర్నాకు దిగేందుకు ఏర్పాట్లపై జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి PACS (ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు) అధ్యక్షులతో చర్చలు జరుపనున్నట్టు సమాచారం.
వరి సేకరణ అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్తో టీఆర్ఎస్ ప్రతినిధులతో సమావేశం కావాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కోరింది. పీఎంవో అపాయింట్మెంట్ను ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ప్రధాని అపాయింట్మెంట్ కోసం సీఎం మరో రోజు ఢిల్లీలోనే వేచి ఉండే అవకాశం ఉంది. పీఎంవో నుంచి స్పందన రాకపోతే మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం హైదరాబాద్కు తిరిగి వస్తారు. చలో ఢిల్లీ లేదా ఏప్రిల్ 11 ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం ఏప్రిల్ 7 మరియు 9 మధ్య మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మోడీ భేటీ కానున్నారు. ఇప్పటికే అపాయింట్మెంట్ లభించింది. దీంతో మంగళవారం సిఎంకు ప్రధాని అపాయింట్మెంట్ లభించే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.