కేంద్రంపై పోరు.. నేడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

Published : Mar 21, 2022, 10:17 AM IST
కేంద్రంపై పోరు.. నేడు కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం

సారాంశం

నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. 

కేంద్ర ప్రభుత్వంపై పోరుకు టీఆర్‌ఎస్ మరోసారి సిద్దమైంది. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనాల్సిందేనని ఢిల్లీ కేంద్రంగా ఉద్యమించేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.  ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులను ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు కూడా హాజరుకానున్నారు. 

ఈ సమావేశంలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగం పక్షాన చేయాల్సిన పోరాటాలు, నిరసనలపై పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని నిలదీసేలా ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

ఇక, పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్తారని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. మంత్రుల బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న కేసీఆర్.. ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి డిమాండ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇక, గతేడాది నవంబరులోను ధాన్యం కొనుగోలు కోసం దిల్లీకి వెళ్లిన కేసీఆర్‌... ప్రధాని, కేంద్ర మంత్రులను కలవలేకపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీరుపై టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ స్వయంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.    

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu