
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు గుప్పించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మీదుగా సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను నడిచిన దారిలో ఎక్కడా మిషన్ భగీరథ రావడం లేదన్నారు. ఐటీడీఏ తవ్విన బావి నుంచే నీళ్లు తీసుకుంటున్నారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూముల పట్టాలు వస్తాయని గిరిజనులు ఆశపడ్డారని.. కానీ ఇప్పుడు కనీసం అడవుల్లోకి కూడా రానివ్వడం లేదని విక్రమార్క ఆరోపించారు. రూ.42,000 కోట్లు వెచ్చించి తీసుకొచ్చిన మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు రావడం లేదని ఆయన దుయ్యబట్టారు.
ట్యాంకులు కట్టి బిల్లులు తీసుకున్నారని.. కేసీఆర్ పాలనలో అతిపెద్ద అవినీతి కుంభకోణం మిషన్ భగీరథేనని భట్టి ఆరోపించారు. పాదయాత్ర వల్ల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయని.. సంపద కొద్దిమందికే పంచుతున్నారని విక్రమార్క ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఛైర్మన్ సహా సభ్యులను తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక నిరుద్యోగులు క్షోభకు గురవుతున్నారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
ALso Read: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం కేసు నిందితులకు బెదిరింపు: కేటీఆర్ పీఏపై రేవంత్ ఆరోపణలు
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిది కీలక పాత్ర అని ఆరోపించారు. కేసీఆర్ కు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ కు పీఏ తిరుపతి షాడో మంత్రి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ పీఏ తిరుపతి, టీఎస్పీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిలు పక్క పక్క గ్రామాలకు చెందినవారేనని ఆయన చెప్పారు. కేటీఆర్ పీఏ తిరుపతి ఒత్తిడి మేరకు రాజశేఖర్ రెడ్డికి టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం వచ్చిందన్నారు. 2015 నుండి ఇప్పటివరకు జరిగిన పరీక్షా పత్రాల లీకేజీలో కొందరికి లబ్ది జరిగిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్ -1 ప్రిలిమ్స్ లో వందకు పైగా మార్కులు వచ్చిన వారందరి వివరాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవుతారని రేవంత్ రెడ్డి నిలదీశారు .
కేటీఆర్ పీఏ, రాజశేఖర్ కు సన్నిహితులైన వారికి టీఎస్పీఎస్సీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయన్నారు. కేటీఆర్ పీఏ సొంత ప్రాంతానికి చెందిన 100 మందికి గ్రూప్ -1 లో 100కు పైగా మార్కులు వచ్చాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఏ విచారణ చేసినా కేటీఆర్ పేషీ నుండే మూలాలు బయటపడతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కథ నడిపింది మొత్తం కేటీఆర్ పీఏ తిరుపతి అని ఆయన ఆరోపించారు.