
మరిన్ని ఉద్యోగనియామకాలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఆమోదం తెలిపింది.ఈ రోజు మూడుగంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో తక్షణ అవసరం మేరకు వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలను చేపట్టాలని నిర్ణయించారు.
హోంశాఖతో పాటు, మిషన్ భగీరథలో 480 పోస్టులు, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో 360 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్, తాజా పరిస్థితిపై చర్చించి అనవసరం అని భావించిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టుకు 7,800 కోట్ల రూపాయలు బ్యాంక్ రుణం తీసుకోవాలని నిర్ణయించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీల రిజర్వేషన్ల బిల్లును ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు.
జైళ్లలో తీసుకురావలసిన సంస్కరణలపై హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి అధ్యక్షతన కెబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో సభ్యులుగా మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి లు ఉంటారు.
ఆసిడ్ దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో మార్పులు తీసుకరావడం. నేరస్తులకు 10 ఏళ్ల నుంచి జీవిత కాలం శిక్ష విధించే అవకాశం. నేరస్తులకు జరిమానా విధించి ఆ డబ్బులను బాధితులకు లేదా వారి కుటుంబ సభ్యులకు అందజేసే విధంగా చట్టంలో మార్పులు తీసుకరావడం లక్ష్యంగా ఈ సబ్ కమిటీ ఏర్పాటు జరిగింది.
అలాగే, స్టేషన్ ఘనపూర్ నియెజకవర్గం మల్కాపుర్ లో దేవాదుల ఆయకట్టు స్థిరీకరణ కోసం రిజర్వాయర్ నిర్మాణం, కంతనపల్లి బ్యారేజ్ కు బదులుగా తుపాకులగూడెం వద్ద గోదావరిపై బ్యారేజ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.
వివిధ శాఖల్లో వున్న అదనపు ఉద్యోగులను పని ఒత్తిడి ఎక్కువగా వున్న శాఖల్లోకి మార్చాలని నిర్ణయించారు.