నేడు మంత్రివర్గ సమావేశం..  ఆ హామీల అమలుపై కీలక నిర్ణయం.. 

Telangana Cabinet Meeting: నేడు సీఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది. 

Google News Follow Us

Telangana Cabinet Meeting: మరో మూడు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో అమలు చేయాల్సిన కార్యచరణపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో ఈ భేటీ జరుగనున్నది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లు పూర్తిచేశారు. 

ఈ సమావేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల విస్తరణ, పెండింగ్‌ పనులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.  సుమారు 40 నుంచి 50 అంశాలపై మంత్రివర్గం చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నది. 

గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భ్రుతి లాంటి అమలు కాని హమీలతో ఇతర పెండింగ్ లో ఉన్న విషయాలపై కూడా చర్చించే అవకాశముంది. అలాగే.. ఎన్నికల వేళ కొత్త హామీల ప్రకటనకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇందులో భాగంగా సొంత స్థలాల్లో ఇంటి నిర్మాణం కోసం రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన గృహలక్ష్మి  పథకంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులూ తమ శాఖల్లో పెండింగ్‌, అభివృద్ధి పనుల నివేదికలు రూపొందించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేశారు. 

అలాగే.. ఇటీవల భారీ వర్షాలతో వాటిల్లిన నష్టాలు, వరద నీటిలో మునిగిన ఊళ్లు, బాధితులకు పునరావాసం, వ్యవసాయ పనుల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

అలాగే.. ఎన్నోరోజులుగా పెండింగ్ లో ఉన్న పంట రుణాల మాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగుల జీతభత్యాల పెంపు వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశముంది. అలాగే..దళితబంధు రెండోవిడత, బీసీలు,మైనారిటీలకు రూ.లక్ష ఆర్థిక సాయం తదితర అంశాలపైనా  కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.