
ఫిబ్రవరి 8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం వుంది. ఫిబ్రవరి 8న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపే అవకాశం వుంది. ఫిబ్రవరి 10న ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనున్నారు. 12వ తేదీ నుంచి 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
బడ్జెట్ సమావేశాలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లుగా కాంగ్రెస్ నేతలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. వీటిపై కేబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశం వుంది.
అంతకుముందు శుక్రవారం ఇంద్రవెల్లి సమీపంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్లో స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు రూ.60 కోట్లకు పైగా రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చారని తెలిపారు.
త్వరలోనే మహిళలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, విద్యార్ధుల యూనిఫాంలు కుట్టే అవకాశం స్వయం సహాయక బృందాలకే అప్పగిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపునొప్పి ఎందుకని ఆయన దుయ్యబట్టారు.