దళిత బంధు ఇప్పిస్తానని తీసుకున్న పైసలు తిరిగి ఇచ్చేయాలి: మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్‌హౌజ్ ముట్టడి

By Mahesh KFirst Published Feb 2, 2024, 8:53 PM IST
Highlights

దళిత బంధు ఇప్పిస్తానని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఒక్కో యూనిట్ నుంచి రూ. 1 లక్ష డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయాలని బాధితులు నిరసన చేశారు. ముత్తిరెడ్డి ఫామ్ హౌజ్‌ను ముట్టడించారు.
 

Dalitha Bandhu: దళిత బంధు ఇప్పిస్తానని ఒక్కో లక్ష రూపాయల చొప్పున తీసుకున్న పైసలు తిరిగి ఇచ్చేయాలని బాధితులు మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫామ్ హౌజ్ ముట్టడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎంపిక చేసిన దళిత కుటుంబానికి రూ. పది లక్షల సహాయాన్ని ఈ పథకం కింద అందిస్తారు. అయితే.. ఈ ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో కేసీఆర్ కూడా ఆయన పార్టీ ఎమ్మెల్యేలను ఈ విషయమై హెచ్చరించారు. 

దళిత బంధు లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల ప్రమేయం కూడా ఉండేది. దీంతో ఎమ్మెల్యేలు కూడా దళితుల నుంచి ఈ పథకం ఆశ చూపి పైసలు దండుకున్నారు. జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా ఇలా దళితుల నుంచి డబ్బులు తీసుకున్నారని తెలుస్తున్నది. మొత్తం 62 యూనిట్లకుగాను 62 మంది వద్ద మొత్తం రూ. 62 లక్షలు తీసుకున్నట్టు బాధితులు చెబుతున్నారు. 

Also Read: Stalin: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కర్ణాటక కోర్టు సమన్లు

ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని నిలిపేసింది. దీంతో ఈ డబ్బులు చెల్లించిన దళితులు తమ డబ్బులు తమకు వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మద్దూర్, దూల్మిట్ట గ్రామాలకు చెందిన పలువురు మద్దూర్ మండల ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ నిరసనకు దిగారు. నర్మెట్ట మండలం హనుమంతపూర్ గ్రామంలోని ముత్తిరెడ్డి ఫామ్‌హౌజ్‌ను ముట్టడించారు.

click me!