
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై కమలనాథులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికి బండి సంజయ్ స్థానంలో అందరిని కలుపుకునిపోయే నేత కిషన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించింది. గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేడర్లో కొంత నైరాశ్యం ఏర్పడింది. అయితే మోడీ వరంగల్ సభ తర్వాత నేతల్లో కొంత జోష్ వచ్చింది. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కేసీఆర్దేనంటూ మోడీ విమర్శలు చేశారు. ఇదే ఊపును జనాల్లోకి తీసుకెళ్లేందుకు కిషన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.
దీనిలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. 19 ఎస్సీ నియోజకవర్గాలు, 12 ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. రెండు వారాల్లోనే 31 సభలు ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ సభలకు బీజేపీ అగ్రనేతలు హాజరుకానున్నారు.
ALso Read: Rajasingh: హరీశ్రావుతో రాజాసింగ్.. బీఆర్ఎస్లో చేరుతారా?
ఇదిలావుండగా.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ రోజు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావును కలిశారు. రాజాసింగ్ పై బీజేపీ సస్పెన్షన్ కొనసాగుతున్న తరుణంలో ఆయన హరీశ్రావుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సమావేశం జరగడంతో రాజాసింగ్ పార్టీ మారుతున్నారా? అనే చర్చ మొదలైంది.
మహమ్మద్ ప్రవక్తపై ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియో రాష్ట్రంలో ఆందోళనలు రేపింది. ఎంఐఎం సహా పలువురు ముస్లింలు ఆ వీడియోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. పోలీసులకూ ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలోనే బీజేపీ అధిష్టానం రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుంచి ఆయన బీజేపీ ఎమ్మెల్యేగా కాకుండా.. కేవలం గోషామహల్ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ఉన్నారు. ఆ తర్వాత రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అనంతరం, ఆయన బయటకు వచ్చారు.
రాజాసింగ్ను బీజేపీలోకి కిషన్ రెడ్డే తీసుకువచ్చారని చెబుతారు. కానీ, ప్రస్తుతం రాజాసింగ్కు కిషన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నది. కనీసం మాట్లాడుకునేంత సన్నిహితం కూడా లేదని తెలుస్తున్నది. కాగా, అదే కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా నియమించింది. దీంతో పార్టీలో రాజాసింగ్కు పరిస్థితులు ప్రతికూలంగా మారినట్టు అర్థం అవుతున్నది. తెలంగాణ బీజేపీలో వర్గాలుగా ఉన్నప్పుడూ రాజాసింగ్.. బండి సంజయ్కు గట్టి మద్దతు ఇచ్చినట్టు తెలిసింది. బండి సంజయ్నే అధ్యక్షుడిగా కొనసాగించాలనే అభిప్రాయాన్ని పలుమార్లు వెల్లడించారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా బండి సంజయ్ పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. కానీ, అధిష్టానం ఈ సస్పెన్షన్ ఎత్తేయలేదు.