Lok Sabha Elections: టీబీజేపీలో టికెట్ వార్? ఈటల వర్సెస్ రఘునందన్..!

By Mahesh KFirst Published Dec 29, 2023, 5:28 PM IST
Highlights

రాష్ట్ర బీజేపీలో ఇప్పుడు మెదక్ ఎంపీ సీటు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీటు నుంచి ఈటల రాజేందర్, రఘునందన్ రావులు పోటీ చేయాలని అనుకుంటున్నారు. టికెట్ కోసం వీరిమధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ పార్టీ హైకమాండ్‌కు విజ్ఞప్తులు చేసి తనకే టికెట్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. కరీంనగర్ ఎంపీ టికెట్ తనకే దక్కాలని పొల్సాని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
 

Medak: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే.. రాజకీయ నాయకులు లోక్ సభ అసెంబ్లీ ఎన్నికల వైపు దృష్టి సారించారు. సీనియర్ నాయకులై.. రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలు కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం పొందారు. వారు ఇప్పుడు ప్రజా ప్రతినిధులు కాదు. ఇప్పుడు ఆ నేతలు లోక్ సభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తాపత్రయపడుతున్నారు. తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతలైన బండి సంజయ్, రఘునందన్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్‌లకు రాష్ట్ర స్థాయిలో క్రేజ్ ఉన్నది. కానీ, వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇందులో ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు ఎంపీలుగా ఉన్నారు. సిట్టింగ్‌లకు అవే స్థానాల నుంచి టికెట్లు అందుతాయని అమిత్ షా మొన్న తెలంగాణ పర్యటనలో హామీ ఇచ్చారు. దీంతో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ పరిస్థితి ఏమిటా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఇద్దరి గురించే ఎందుకు మాట్లాడుతున్నారంటే.. వీరిద్దరూ మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య టికెట్ కోసం పోటీ నెలకొంది. వీరిద్దరూ ఈ ఎంపీ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. రఘునందన్ రావు దుబ్బాక నుంచి ఈటల రాజేందర్ గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. నిజానికి ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్ కంటే కూడా గజ్వేల్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అందుకే ఇప్పటికీ అక్కడ తనకు కొంత పట్టు ఉన్నది. కాబట్టి, ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఉండే మెదక్ ఎంపీ స్థానం టికెట్ పొందాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, మల్కజ్‌గిరి స్థానం నుంచైనా పోటీ చేస్తాననే సంకేతాలు ఈటల ఇచ్చారు.

Also Read: Miracle: 40 నిమిషాలు మరణించి లేచింది.. చావు అనుభవాలను ఇలా చెప్పింది..!

రఘునందన్ రావు కూడా దుబ్బాకలో ఓడిపోయాక మెదక్ ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోటు ఎపిసోడ్ వల్లే తాను ఓడిపోవాల్సి వచ్చిందని, లేదంటే.. తానే గెలిచేవాడిననే ధీమా రఘునందన్‌లో ఉన్నది. తనకు ఇప్పటికీ ఇక్కడ మంచి పట్టు ఉన్నదని, తనకే మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

వీరిద్దరూ అధిష్టానానికి మెదక్ ఎంపీ టికెట్ కోసం విజ్ఞప్తులు చేసుకున్నారట. ఇద్దరూ సీనియర్లే కావడం, ఇద్దరూ ఒకే సీటు అడగడంతో హైకమాండ్ కూడా గందరగోళంలో పడిందట. ఇదిలా ఉండగా, మెదక్ బీజేపీ నేతలు మాత్రం రహస్యంగా సమావేశమై వీరిద్దరికీ కాకుండా ఒక కొత్త నాయకుడిని బరిలో నిలపాలని ఓ తీర్మానం చేశారట. ఆ తీర్మానాన్ని పార్టీ అధిష్టానానికి కూడా పంపించారట.

Also Read: Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవానికి సోనియా గాంధీ!

కరీంనగర్ పార్లమెంటు స్థానం నుంచి బండి సంజయ్‌కు టికెట్ దాదాపు కన్ఫమ్ అయిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం సీనియర్ బీజేపీ లీడర్ పొల్సాని సుగుణాకర్ రావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

click me!