
టీఆర్ఎస్ నేతలు అనుభవిస్తోన్న పదవులు బీజేపీ పెట్టిన భిక్షేనన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ వచ్చింది కేసీఆర్ వల్ల కాదని, తమ పార్టీ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ (sushma swaraj) వల్ల అని బండి సంజయ్ చెప్పారు. ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే బీజేపీ ఇస్తుందని సుష్మా పేర్కొన్నారని బండి సంజయ్ గుర్తుచేశారు. ఒకవేళ పార్లమెంటులో కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పెట్టకుంటే బీజేపీ ప్రైవేట్ బిల్లు పెడుతుందని సుష్మా స్వరాజ్ చెప్పారని ఆయన వెల్లడించారు.. అందుకు భయపడే కాంగ్రెస్ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిందని బండి సంజయ్ గుర్తుచేశారు.
పెట్రోల్, డీజిల్ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు లేదని ఆయన ఫైరయ్యారు. దేశంలో తెలంగాణలోనే పెట్రో ధరలు అత్యధికంగా ఉన్నాయని బండి సంజయ్ అన్నారు. చమురుపై కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, 18 రాష్ట్రాలు తాము విధించే పన్నులను తగ్గించాయని ఆయన గుర్తుచేశారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి కూడా తగ్గించలేదని, అంతేకాకుండా రాష్ట్రంలో వ్యాట్ పేరుతో లీటరుకు రూ.35 వసూలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
మరోవైపు మంత్రి కేటీఆర్ సవాల్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. సీఎం కేసీఆర్తో (kcr) బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఎనిమిదేళ్లుగా మీరెంత ఖర్చు చేశారో... కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. సాయి గణేష్ ఆత్మహత్య (sai ganesh suicide) చేసుకున్న చోటే.. టీఆర్ఎస్ను భూస్థాపితం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని... తాము ఎవ్వరినీ వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు. పోలీసులు లక్ష్మణ రేఖ దాటొద్దని.. సాయి గణేష్ ఆత్మహత్యు ప్రభుత్వానిదే బాధ్యతని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల హయాంలోనే ఖమ్మం (khammam) అభివృద్ధి జరిగిందని.. ఖమ్మంలో మీరేం చేశారో చెప్పాలంటూ కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ గెలవబోతోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.
కాగా.. కొద్దిరోజుల క్రితం (bjp) బీజేపీకి (trs) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) సవాల్ విసిరారు. తాను చెప్పింది రుజువు చేస్తే సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.కోటి 65 లక్షలు మాత్రమేనన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు రుజువు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డిలపై (revanth reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.