
హన్మకొండలో యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది అజహర్ తన నేరాన్ని అంగీకరించాడు. తన ప్రేమను అంగీకరించకపోవడంతోనే తన వెంట తెచ్చుకున్న కత్తితో అనూషపై దాడి చేసినట్టుగా ఒప్పుకున్నాడు. కత్తితో అనూష గొంతుకోసినట్టుగా అంగీకరించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి అజహర్ను సుబేదారు పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు అతడిని జైలుకు తరలించారు. ఇక, ఈ కేసుకు సంబంధించి పోలీసులు అజహర్పై 354, 307, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు ప్రేమోన్మాది అజహర్ దాడిలో తీవ్రంగా గాయపడిన అనూష ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అనూష ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కోలుకుంటున్న వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే అనూష తండ్రి మాట్లాడుతూ.. ఇప్పటికే కొడుకును కోల్పోయి షాక్లో ఉన్నామని చెప్పారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇక, హన్మకొండలోని గాంధీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న 23 ఏళ్ల అనూష ఇంట్లోకి చొరబడిన అజహర్.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అయితే అందుకు అనూష నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. అనూషను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష కుటుంబం 15 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కరీంనగర్ వెళ్లింది. అనూష ప్రస్తుం కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవలే ఆ కుటుంబం.. హనుమకొండకు మకాం మార్చింది. అయితే కొంత కాలం నుండి అజహర్ అనూషను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న అజహర్ యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు.
‘‘కాకతీయ యూనివర్శిటీకి చెందిన ఎంసీఏ విద్యార్థిని కొన్నేళ్ల క్రితం అజహర్ నివాసం ఉంటున్న వరంగల్ జిల్లా మొండ్రాయి గ్రామంలో తన బంధువుల వద్దకు వెళ్లింది. అప్పుడు అజహర్తో పరిచయం ఏర్పడిందని ప్రాథమిక విచారణలో తేలింది. శుక్రవారం అజహర్ తనను కలవాలని కోరుతూ ఆమెకు ఫోన్ చేశాడు. బాధితురాలు అతని ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ క్రమంలోనే కోపంతో నిందితుడు సమీపంలోని దుకాణం నుండి కత్తిని కొనుగోలు చేసి ఆమెపై దాడి చేశాడు”అని హనుమకొండ ఏసీపీ ఎం జితేందర్ రెడ్డి తెలిపారు.