
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ప్రచారంలో నేతలు బిజీబిజీ గా ఉంటే.. మరోవైపు రాజకీయ నాయకులు, ప్రముఖుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు వరుసగా సోదాలు చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పలువురు రాజకీయ నేతల ఇళ్లలో తనిఖీలు చేశాయి. తాజాగా ఓ మాజీ ఐఏఎస్ ఇంట్లో సోదాలు నిర్వహించటం చర్చనీయం. తాజాగా మాజీ ఐఎఏస్ ఏకే గోయల్ ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్వ్కాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.
ఎన్నికల నేపథ్యంలో మాజీ ఐఎఎస్ నివాసంలో భారీ మొత్తంలో నగదు, విలువైన వస్తువులు దాచారనే సమాచారంతో.. జూబ్లీహిల్స్లోని రోడ్డు నెంబర్ 22లో గల గోయల్ నివాసంలో దాదాపు నాలుగు గంటలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకే గోయల్ 2010లో పదవీ విరమణ చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారుగా పని చేశారు. మాజీ అధికారి కాబట్టి ఆయన నివాసంలో డబ్బులు దాచి ఉంటారని సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. గోయల్ సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు విలువైన వస్తువులను లోపలి నుంచి బయటకు తీసుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఓ టాస్క్ ఫోర్స్ పోలీసు వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన బైక్ను ఆపేశారు. మాజీ ఐఎఏస్ ఏకే గోయల్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సలహాదారునిగా పని చేశారు. ఈ నేపథ్యంలో ఏకే గోయల్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.