పాఠాలు చెబుతూనే కుప్పకూలిన ఉపాధ్యాయుడు

First Published Jul 19, 2018, 9:55 AM IST
Highlights

మరోసారి ఛాతినొప్పిరాగా తోటి అధ్యాపకులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.

 పిల్లలకు ఉత్సాహంగా పాఠాలు చెబుతూనే ఓ ఉపాధ్యాయుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తరగతి గదిలో పాఠం చెబుతుండగా ఛాతిలో నొప్పిగా ఉంటే ప్రైవేటు వైద్యుడు సూచించిన రెండు మాత్రలు వేసుకొని మళ్లీ కళాశాలకు వచ్చారు. మరోసారి ఛాతినొప్పిరాగా తోటి అధ్యాపకులు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.

 ఆ యువ అధ్యాపకుడు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం చోటు చేసుకొంది. వికారాబాద్‌ జిల్లా పరిగికి చెందిన సుభాష్‌ చంద్రబోస్‌(32) డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు.

 బుధవారం తరగతి గదిలో పాఠాలు చెప్తుండగా ఛాతిలో నొప్పి రావడంతో తోటి అధ్యాపకుల సాయంతో సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు వెళ్లారు. వైద్యుడు పరీక్షించి రెండు మాత్రలు ఇవ్వగా అవి వేసుకుని  కళాశాలలో సేదతీరుతుండగా మళ్లీ నొప్పిరావడంతో పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. చంద్రబోస్‌ అక్కడే కుప్పకూలిపోయారు. ఆయనకు భార్య, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు.

click me!