
తెలంగాణ సర్కారు చేప్టటిన విధానాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతున్నాయి. కొత్త జిల్లాలు ఎందుకు సృష్టించారో కానీ నిరుద్యోగులకు నరకం చూపుతున్నాయి. కొత్త జిల్లాలతో కొత్త కొలువులు వచ్చి జీవితాలు బాగుపడతాయనుకుంటే ఉన్న ఉద్యోగాలు రాకుండా కొత్త జిల్లాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయని నిరుద్యోగులు ఊసూరుమంటున్నారు.
తాజాగా కొత్త జిల్లాల ప్రకారమే కొత్త డిఎస్సీ నిర్వహిస్తామంటూ తెలంగాణ సర్కారు చేసిన ప్రకటన నిరుద్యోగ టీచర్ అభ్యర్థుల గుండెల్లో రాళ్లు పడ్డంత పనైంది. దీంతో కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సీ వద్దు. పాత జిల్లాల ప్రకారమే డిఎస్సీ నిర్వహించాలంటూ ఉపాధ్యాయ నిరుద్యోగులు రోడ్డెక్కారు. పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ముట్టడించి ధర్నా చేశారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ కార్యదర్శి కిషన్ వారికి సద్ది చెప్పారు
మొత్తానికి డిఎస్సీ ఏర్పాటు చేయకుండా మూడేళ్లు నానబెట్టిన తెలంగాణ సర్కారు తుదకు డిఎస్సీ వేసే సమయంలో సరికొత్త వివాదాలను రేకెత్తించేలా ప్రకటనలు చేస్తున్నదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఇక మిగిలిన రెండేళ్లలోనైనా కనీసం ఒక టీచర్ పోస్టు అయినా తెలంగాణ సర్కారు భర్తీ చేస్తుందా లేదా అన్నది అనుమానంగానే మారింది.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇవాళ విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేసిన వారంతా సిఎం కెసిఆర్ ఫొటో, మంత్రి కడియం ఫొటోలతో కూడిన బ్యానర్ ను ప్రదర్శించారు. సర్కారు పెద్దల ఫొటోలు పెట్టుకుని ధర్నా చేయడంలో మతలబేంటబ్బా అని ఇంకొందరు నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సర్కారు ప్రేరేపిత ధర్నాలు కావొచ్చా అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.