తెలంగాణ టెట్ నిర్వహణలో సర్కారు కుట్ర కోణం దాగి ఉందని నిరుద్యోగ జెఎసి అనుమానం వ్యక్తం చేసింది. పరీక్షలో సిలబస్ లో లేని అంశాల మీద ప్రశ్నలిచ్చారని ఆరోపించింది. అందుకే ఉత్తీర్ణత 19 శాతం దాటలేదని తెలిపింది. దీన్నిబట్టి చూస్తే సర్కారు కుట్రపూరితంగా ఉత్తీర్ణత తగ్గించే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. ఆరుసార్లు జరపాల్సిన టెట్ సర్కారు చేతగానితనం వల్ల రెండుసార్లే జరిపిందని నిరుద్యోగ జెఎసి ఫైర్ అయింది.
తెలంగాణ సర్కారు జరిపిన టెట్ లో 2 గ్రేస్ మార్కులు కలిపి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని నిరుద్యోగ జెఏసి డిమాండ్ చేసింది. టెట్ పేపర్1, టెట్ పేపర్ 2లో రెండు ప్రశ్నలకు డబుల్ ఆన్సర్స్ ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకుని రెండు మార్కులు(యాడ్ స్కోర్) కలపాలని జెఎసి ఛైర్మన్ కోటూరి మానవతా రాయ్ డిమాండ్ చేశారు. టెట్ ఐక్యవేదిక అభ్యర్థులతో కల్సి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
టెట్ అర్హత సాదించిన అభ్యర్థులంతా ఉపాధ్యాయ ఉద్యోగాలు అడగ కుండా ప్రభుత్వం కావాలనే కుట్రచేసి ఉత్తీర్ణతా శాతాన్ని తగ్గించిందని మానవతా రాయ్ విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పుకు నిరుద్యోగ అభ్యర్థులను బలిచేయటం సరికాదని ఆయన పేర్కొన్నారు. 6సార్లు టెట్ నిర్వహించాల్సిన ప్రభుత్వం తన అసమర్థత వల్ల రెండు సార్లే టెట్ నిర్వహించి నిరుద్యోగులను నిలువునా ముంచిందన్నారు.
ప్రామాణిక పుస్తకాల్లోంచి సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇవ్వని కారణంగా అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని అలాంటి వారందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర నిరుద్యోగ జెఏసి నాయకులు వి భీమ్ రావ్ నాయక్ ,ఓయూ NSUIనాయకులు మస్కాపురం నరేష్,ఓయూ నిరుద్యోగ జెఏసి అధ్యక్షులు బూసిపల్లి లచ్చిరెడ్డి, ఇబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర ఛైర్మన్ కొప్పుల ప్రతాప్ర్ రెడ్డి, టెట్ ఐక్యవేదిక అభ్యర్థులు ఓంప్రకాష్, నరేష్,ప్రశాంత్ రెడ్డి, ఎల్లాగౌడ్,గ్రహీత్ రెడ్డి, సాయికృష్ణ,నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.