నారా భువనేశ్వరికీ కొండా సురేఖ బాసట: కనీసం స్పందించాలిగా... కేటీఆర్, కవిత, షర్మిలపై ఆగ్రహం

By Siva KodatiFirst Published Nov 22, 2021, 9:13 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిపై అధికార వైసిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై బోరున విలపించిన విషయం తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, టీ. కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్పందించారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తన భార్య భువనేశ్వరిపై అధికార వైసిపి నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురై బోరున విలపించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో జరిగిన ఘటనగురించి రాష్ట్రప్రజలకు తెలియజేస్తూ తన భార్య nara bhuvaneshwari పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుని chandrababu naidu కన్నీటిపర్యంతం అయ్యారు. వెక్కి వెక్కి ఏడుస్తూ తన మనసు ఎంతలా గాయపడిందో వ్యక్తపర్చారు.  సుదీర్ఘ రాజకీయ అనుభవం, గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న చంద్రబాబు కుటుంబం పట్ల వైసిపి నేతల నిండుసభలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించడాన్ని TDP నాయకులే కాదు సీనీ ప్రముఖులూ ఖండిస్తున్నారు. 

తాజాగా దీనిపై మాజీ మంత్రి, టీ. కాంగ్రెస్ నేత కొండా సురేఖ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఘటనను దేశం మొత్తం ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచిది కాదని .. ఇటువంటి ఘటనలపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గళం విప్పాలని సురేఖ అన్నారు. ఈ ఘటనపై జగన్ సోదరి, వైఎస్ షర్మిల కూడా స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ ఘటనపై సీఎం కేసీఆర్ కుమార్తె కవిత స్పందించకపోవడం విచారకరమన్నారు. అటు తల్లి లాంటి మహిళకు అవమానం జరిగినా మంత్రి కేటీఆర్ కనీసం స్పందించకపోవడం బాధాకరమని సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయొచ్చు కదా అని ఆమె అన్నారు. 

Also Read:నిండు సభలో భార్యపై అనుచిత వ్యాఖ్యలు... బోరున విలపించిన చంద్రబాబును పరామర్శించిన రజనీకాంత్

మరోవైపు.. ఈ అంశంలో రోజా, లక్ష్మీపార్వతి స్పందించిన తీరు తనను ఆశ్చర్యానికి గురిచేసిందని సురేఖ వ్యాఖ్యానించారు. సాటి మహిళకు అవమానం జరిగిన వేళ రోజా శాపనార్థాలు పెట్టడం సమంజసం కాదన్నారు. లక్ష్మీపార్వతి మాటలు విన్నాక ఆమెపై ఉన్న గౌరవం కాస్తా తొలగిపోయిందని కొండా సురేఖ స్పష్టం చేశారు. రాజకీయాలు పార్టీల వరకే పరిమితం కావాలని, కుటుంబాలకు వరకు తీసుకుపోవద్దని ఆమె సూచించారు.

కాగా.. గత శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలతో చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తన ఆవేదనను రాష్ట్రప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలోనే భావోద్వేగానికి లోనయిన ఆయన బోరున విలపించారు. తన భార్య భువనేశ్వరి గురించి వైసిపి నాయకులు నిండుసభలో అవమానకరంగా మాట్లాడారంటూ చంద్రబాబు వెక్కి వెక్కి కళ్లనీళ్లు పెట్టుకున్నారు. తన సుధీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదంటూ ఆవేదన వ్యక్తం చేసారు.  నేడు జరిగిన ఘటనపై ఏం చెప్పాలో కూడా అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు. తనకు పదవులు అవసరం లేదని అన్నారు. క్షేత్ర స్థాయిలో తెల్చుకున్న తర్వాతే తిరిగి అసెంబ్లీకి వెళ్తానని చెప్పారు. తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపధం చేసారు. 

click me!