రాజేంద్ర నగర్‌లో బ్యూటీషియన్ మృతిపై అనుమానాలు.. అతడి కోసం పోలీసులు గాలింపు..?

By Sumanth KanukulaFirst Published Jan 17, 2022, 11:23 AM IST
Highlights

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌‌లోని (rajendra nagar) బ్యూటీషియన్ ఇరాంఖాన్‌ మృతి అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ నెల 7వ తేదీన ఆమె బర్త్‌ డే జరుపుకుంది. ఆ తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడంపై పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు.

హైదరాబాద్ రాజేంద్ర నగర్‌‌లోని (rajendra nagar) బ్యూటీషియన్ ఇరాంఖాన్‌ అలియాస్ సమేరా మృతి అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫ్లాట్‌లో Beauticianతో పాటు కలిసి ఉంటున్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. ఈరమ్ ఖాన్‌ తల్లిదండ్రులు టోలీ చౌకీలో నివాసం ఉంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఇరాంఖాన్‌కు పెళ్లి జరగింది. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఇరాంఖాన్‌ భర్తతో విడిపోయింది. 

అప్పటి నుంచి ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింత‌ల్‌మెంట్ మొగుల్‌మిడోస్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. మోడలింగ్ చేయడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆమె వారికి దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఫ్లాట్‌లో ఆమెతో పాటు మరో యువకుడు ఉంటున్నాడని, వారిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని ప్రాథమికంగా నిర్దారణ అయింది. 

ఈ నెల 7న పుట్టిన రోజు వేడుకలు ఉండటంతో కొందరు యువకులు ఇరాంఖాన్‌ అపార్ట్‌మెంట్‌కు వచ్చి వెళ్లారు. అయితే ఆ తర్వాత నుంచి ఆమె పెద్దగా బయట కనిపించలేదు. మరోవైపు కొద్ది రోజల క్రితం సోదరుడికి ఫోన్ చేసిన ఆమె జీవితంపై విరక్తి‌గా ఉన్నట్టుగా తెలిపింది. అయితే ఆమె ఉంటున్న ప్లాట్ నుంచి దుర్వాసన రావడంతో అక్కడివారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. లోపల ఇరాంఖాన్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసులు బ్యూటీషియన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు.. డ్వాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఆమె మృతిచెంది నాలుగైదు రోజులు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యువకుడు ఎవరు, బర్త్ డే సందర్భంగా ఆమె ప్లాట్‌కు ఎవరెవరు వచ్చారు, ఆమె చివరిసారిగా ఎవరితో ఫోన్‌లో మాట్లాడారని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అపార్ట్‌మెంట్ సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఆమెతో ప్లాట్‌ ఉంటున్న యువకుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అతని ఆచూకీ దొరికితే కేసులో అసలు విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఇరాంఖాన్‌ కొంతకాలంగా ఒత్తిడి‌లో ఉందని ఆమె తల్లి చెప్పారు.  

click me!