
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
ఈడీ విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఈ నెల 24న విచారణ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో రేపు ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిన పరిస్థితుులు నెలకన్నాయి.
ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ పిటిషన్ ను అడ్మిట్ చేసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ అత్యవసరంగా విచారించలేమని ఉన్నత న్యాయస్థానంతెలిపింది.ఈ నెల 24న ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని సుప్రీంకోర్టు ప్రకటించింది. మరో వైపు ఈ విషయమై స్టేకి కూడా ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అంతేకాదు ఈడీ అధికారులు మహిళను విచారించవచ్చా అని కూడా కవిత ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈడీ అధికారులు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కూడా 23న విచారించనుంది సుప్రీంకోర్టు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 11న కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. తొమ్మిది గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. రేపు మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కోరారు. దీంతో సుప్రీంకోర్టులో కవిత న్యాయ పోరాటానికి దిగారు. ఈడీ విచారణపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు దఫాలు సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 6వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులకు అరుణ్ రామచంద్రపిళ్లై ఇచ్చిన వాంగ్మూలంలో కవిత పేరు ఉన్నట్టుగా కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈడీ అధికారులు పేర్కొన్నారు. దరిమిలా ఈ నెల 8వ తేదీన కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు రావాలని ఆదేశించారు. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు సమయం కావాలని కవిత కోరారు. ఈ నెల 11న కవిత విచారణకు హాజరయ్యారు. రేపు మరోసారి విచారణకు హాజరు కానున్నారు.
also read:ఢీల్లీకి చేరుకున్న కవిత: రేపు ఈడీ విచారణపై ఉత్కంఠ
మరో వైపు గతంలో ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను అరుణ్ రామచంద్రపిళ్లై వెనక్కి తీసుకున్నారు. అరుణ్ రామచంద్రపిళ్లై ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కవితకు మాజీ ఆడిటర్ గా ఉన్న బుచ్చిబాబును ఈడీ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారు. దీంతో వీరిద్దరితో కలిపి కవితను విచారించే అవకాశం ఉందా అనే చర్చ కూడా లేకపోలేదు. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.