ఇంటర్ బోర్డు ముందు విద్యార్థి సంఘాల నిరసన.. పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట.. టెన్షన్ వాతావరణం..

By Sumanth KanukulaFirst Published Dec 18, 2021, 1:38 PM IST
Highlights

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు (Telangana Inter 1st year results) తీవ్ర గందరగోళం రేపుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు కారణమైన ఇంటర్ బోర్డు సెక్రటరీని వెంటనే తొలగించాలని విద్యార్థి సంఘాలు (student unions) డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థులందరినీ పాస్ చేయాలని కోరుతున్నాయి.
 

తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు (Telangana Inter 1st year results) తీవ్ర గందరగోళం రేపుతున్నాయి. ఇంటర్ ఫస్టియర్‌లో కేవలం 49 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. అయితే ఈ ఫలితాలపై విద్యార్థుల నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా ఇంటర్ పరీక్షల నిర్వహణ తీరుపై, ఫలితాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫలితాల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపిస్తున్న విద్యార్థి సంఘాలు.. ఇంటర్ బోర్డు (Board of Intermediate Education) ఎదుట ఆందోళన చేపడుతున్నాయి. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాయి. 

ఫలితాల్లో అవకతవకలు కారణమైన ఇంటర్ బోర్డు సెక్రటరీని వెంటనే తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులందరినీ పాస్ చేయాలని కోరుతున్నాయి.  ఈ క్రమంలోనే శనివారం ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించింది. అయితే అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. రోడ్డు మీదే బైఠాయించిన విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

సిలబస్ పూర్తి చేయకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను మానసికంగా గందరగోళానికి గురిచేశారని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్‌ చేయాలని కోరారు. ఇంటర్ బోర్డు సెక్రటరీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము ఉద్యమ బాట పడుతామని వారు హెచ్చరించారు. గతంలో కూడా ఇంటర్ బోర్డు నిరక్ష్యం కారణంగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. సాంకేతిక లోపాలను సవరించాలని కోరారు. 

ఇదిలా ఉంటే విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్‌ సెక్రటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ శుక్రవారం తెలిపారు. ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్‌ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురికావద్దని కోరారు. 

click me!