
మొయినాబాద్ ఫామ్హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతం చేసింది. దీనిలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న సిట్ ఎదుట హాజరవ్వాలని ఆదేశించింది. ఫాంహౌస్ వ్యవహారంలో నిందితుడైన రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్ ఈ నిర్ణయం తీసుకుంది.
అంతకుముందు ఇదే కేసులో తుషార్కు సిట్ బృందం గురువారంనాడు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 లోపుగా విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొంది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తుషార్ పేరును ప్రస్తావించారు. దీంతో తుషార్ ను విచారణకు రావాలని సిట్ బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది.
ALso Read:కేసీఆర్ ప్రకటనతో టీఆర్ఎస్లో కలకలం.. ఆ నేతల్లో అసంతృప్తి, భవిష్యత్తుపై ఆందోళన..!
మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్లను పోలీసులు అరెస్ట్ గత నెల 26న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ కు హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తున్నారు. సిట్ దూకుడుగా ఈ కేసును విచారిస్తుంది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , హర్యానా రాష్ట్రాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. కేరళ రాష్ట్రంలో ఇద్దరిని సిట్ అదుపులోకి తీసుకుంది.
తుషార్ కి రామచంద్రభారతికి ఈ డాక్టర్ మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. రామచంద్రభారతి తుషార్ పేరును ప్రస్తావించినట్టుగా ఆడియో సంభాషణల్లో ఉంది. ఈ నెలలో తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో తుషార్ పేరును కూడా ప్రస్తావించారు. కేంద్ హోంమంత్రితో తుషార్ సమావేశమైన ఫోటోను కూడా మీడియా సమావేశంలో కేసీఆర్ చూపించిన విషయం తెలిసిందే.