
తెలంగాణ కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. సీఎం వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు వున్నారు.
ఇకపోతే.... నూతనంగా నిర్మిస్తోన్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు కేసీఆర్. అంబేద్కర్ దార్శనికతతోనే తెలంగాణ ఏర్పాటైందని సీఎం కొనియాడారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికే ఆదర్శమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని.. త్వరలోనే దీనికి సంబంధించి ప్రధానికి లేఖ రాస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
ALso Read:కొత్త సచివాలయం నిర్మాణం: గ్రానైట్, మార్బుల్స్ మోడల్స్కు కేసీఆర్ ఆమోదముద్ర
కొత్త సచివాలయం భవనాన్ని సర్వాంగ సుందరంగా, దేశం గర్వించేలా తీర్చిదిద్దాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు గతంలోనే అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను సత్వరం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు. నిర్మాణంలో ఉన్న మినిస్టర్ చాంబర్లు, పార్కింగ్ ఏరియాలు, సెక్రటరీలు, వీఐపీల చాంబర్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు పలు సూచనలిస్తున్నారు.