
దేశంలో మైనారిటీలకు పెద్ద దిక్కులా వ్యవహరించే అసదుద్దీన్ ఓవైసీ రూటు మార్చారా.. కషాయదళంపై కారాలు మిర్యాలు నూరే ముస్లింల పెద్దన్న యూ టర్న్ తీసుకున్నారా... అంటే అవుననే అంటున్నాయి కొన్ని ముస్లిం వర్గాలు.
ముఖ్యంగా మక్కా యాత్రకు వెళ్లే వారికి సబ్సిడీ తీసివేయాలని అసదుద్దీన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై కొన్ని ముస్లిం వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
మైనారిటీల హక్కులకు కాపలాగా, అణిచివేతపై పోరాడే యోధుడిగా అసద్ కు మంచి పేరుంది. ఒక్క హైదరాబాద్ పాతబస్తీలోనే కాదు కేరళ నుంచి కశ్మీర్ వరకు అసద్ అసలు సిసలు మైనారిటీ నాయకుడిగా గుర్తింపు పొందారు.
అయితే ఆశ్చర్యకరంగా కరుడ గట్టిన హిందువుల నుంచి కూడా రాని ఓ డిమాండ్ ను అసద్ చేయడంతో ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు సబ్సిడీ తీసివేయాలని దానికి బదులుగా ఆ మొత్తాన్ని ముస్లిం బాలికల విద్యపైన ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాగా డబ్బున్న ముస్లింలు మాత్రమే ఎక్కువగా హజ్ యాత్రకు వెళ్తుంటారని, అలాంటి వారికి మళ్లీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నది అసద్ అభిప్రాయంగా ఉంది.
అయితే దీనిపై కొన్ని ముస్లిం వర్గాలు హర్షం వ్యక్తం చేయగా మరికొన్ని ముస్లిం వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
కాంగ్రెస్ శాసనమండలి విపక్షనేత, మైనారిటీ నేత షబ్బీర్ అలీ అయితే అసద్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మెప్పు కోసమే అసద్ మాట్లాడుతున్నట్లుగా ఉందని తప్పుపట్టారు.
జీవితంలో ఒక్కసరైనా మక్కాకి వెళ్లాలని ముస్లింలకు ఉంటుందని, బ్రిటిష్ కాలంలోనే 1932 లో సబ్సిడి ప్రారంభమైందని గుర్తు చేశారు.
ప్రతి ఏడాది 1.72 కోట్ల మంది భక్తులకు కేంద్రం రూ. 690 కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం ముస్లింలకే కాకుండా మానస సరోవర్ వెళ్లేవారికి కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ముస్లింలకు సబ్సిడి రద్దు చేసి నిధులు సంక్షేమానికి మల్లించాలని అసద్ కోరటం సరికాదన్నారు.
ఆర్ఎస్ఎస్ ఎజెండాను అసద్ మోస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.