టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆయనపై జర్నలిస్టులు ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఎంపీ సహాయకుడు నలుగురిపై పెట్టిన కేసు మరో మలుపు తీసుకోవడంతో సుమన్ వివాదంలో చిక్కుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ ను లైంగిక దోపిడీ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఈ మేరకు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. హైదరాబాదు బంజారాహిల్స్లోని ఆయన ఫ్లాట్లోకి ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వచ్చి దౌర్జన్యం చేశారని, తనను బెదిరించారని ఎంపీ సహాయకుడు మర్రి సునీల్ గత నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మే 31న సాయంత్రం బంజారాహిల్స్ నందినగర్లో ఉన్న ఎంపీ అపార్ట్మెంట్కు వచ్చిన ఆ నలుగురు తనను నెట్టేసి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారని, బాల్క సుమన్ కోసం ఇల్లంతా గాలించారని తెలిపారు. లోపల ఆయన కనిపించలేదని, దాంతో ఆయన్ను, తనను తిట్టారని ఆయన ఆరోపించారు.
ఎంపీ మంచిర్యాలకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించినట్లు తెలిపారు. దౌర్జన్యం చేసిన వారి పేర్లను సంధ్య, విజేత, శంకర్, గోపాల్లుగా చెప్పాడు. సునీల్ ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు ఐపీసీ 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అయితే, ఇదే విషయంపై ఎంపీ బాల్క సుమన్పై జర్నలిస్టులు మల్హోత్రా, సురభి నిర్మల్, న్యాయవాదులు వీఎస్రావు, ఎంఎస్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. సంధ్య, విజేతలు నిందితులు కాదని, ఎంపీ బాల్క సుమన్ బాధితులని వారు ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. సంధ్య, మరి కొందరు మహిళలు చాలాకాలంగా ఎంపీ చేతిలో లైంగిక దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు.
సంధ్య, విజేత, శంకర్, గోపాల్లు ఎంపీ బాల్క సుమన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, దౌర్జన్యం చేశారని ఎంపీ సహాయకుడు మర్రి సునీల్ ఫిర్యాదులో తెలుపగా, పోలీసులు మాత్రం ఎక్కడా ఎంపీ పేరు ప్రస్తావన రాకుండా జాగ్రత్తగా ఎఫ్ఐఆర్ రాశారని తెలిపారు.
నలుగురు బాధితులను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు మనుషులు నిర్బంధించి వివరాలు తీసుకున్నారని, ఎంపీతో మహిళలకు ఉన్న సెక్స్ సంబంధాల గురించి చెబితే ప్రాణాలు దక్కవని హెచ్చరించారని వారు చెప్పారు. పార్టీలు, మహిళా కమిషన్ జోక్యం చేసుకొని బాధితులను ఎంపీ నుంచి, పోలీసుల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.