
హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది. ప్రతిరోజూ ముసురు వర్షాలు, భారీ వర్షాలు, మామూలు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో మొదలయ్యే సీజనల్ వ్యాధులు కూడా నేనున్నానంటూ జనాలను పీడించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే వ్యాధుల భారిన పడిన వారు ఆసుపత్రుల్లో క్యూ కడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, వాంతులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
ఇప్పటి వరకు నల్లకుంట లోని నీలోఫర్ ఆసుపత్రిలో 400 వరకు మాత్రమే ఓపి నమోదు ఉండగా గత రెండు మూడు రోజులుగా ఓపి సంఖ్య 600కు చేరిందని డాక్టర్లు చెబుతున్నారు. దీనితోపాటు ఉస్మానియా, గాంధీ వంటి ఆసుపత్రుల ఓపి కూడా అమాంతంగా పెరిగింది.
నీటి కాలుష్యం కూడా పెరిగే ప్రమాదముంది. వర్షాల వల్ల డ్రైనేజీల్లోని నీరు మంచినీటి పైపుల్లోకి చేరడం ఆ నీళ్లను నేరుగా తాగడంతో డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మురుగు నీరు నిల్వ ఉండడం, వర్షం నీరు నిల్వ ఉండడంతో దోమల వ్యాప్తి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి.
తినేముందు చేతులను శుభ్రంగా సబ్సుతో కడుక్కోవాలి.
వేడి వేడి ఆహార పదార్థాలు తినాలి.
ఆహార పదార్థాల మీద నిండుగా మూతలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి వస్తే డాక్టర్ కు చూపించాలి. అవసరం లేకపోయినా యాంటిబయాటిక్స్ వాడరాదు.