
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కీవ్లోని ఇండియన్ ఎంబసీ (indian embassy) భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశాన్ని విడిచి వచ్చేందుకు పలువురు భావిస్తున్నా.. టికెట్లు దొరకడం లేదు, దొరికినా వాటిని కొనుగోలు చేసేంత స్తోమత వారి వద్ద వుండటం లేదు. అటు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల్లో 300 మంది తెలుగువారు కూడా వున్నట్లు తెలుస్తోంది.
వీరిలో పరువు హత్యకు బలైన మిర్యాలగూడ ప్రణయ్ (miryalaguda pranay) తమ్ముడు అజయ్ కుమార్ (ajay kumar) కూడా వున్నాడు. దీంతో అతని క్షేమ సమాచారంపై తల్లిదండ్రులు బాలస్వామి (balaswamy), ప్రేమలత (premalatha) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా భారతదేశానికి తీసుకురావాలని వారు కోరుతున్నారు. అజయ్ ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడని.. మూడు నెలల్లో ఇండియా తిరిగి వచ్చేస్తాడని బాలస్వామి తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా దాడి జరగడం బాధాకరమని.. మూడు, నాలుగు రోజులుగా అజయ్ని వచ్చేయమనే చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
విమానం బుక్ చేశామని.. కానీ ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేయడంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయని బాలస్వామి వెల్లడించారు. మొత్తం భారతదేశానికి చెందిన 10 వేల మంది విద్యార్ధులు అక్కడ మెడిసిన్ చదువుతున్నారని.. వారందరినీ తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వారంతా ప్రస్తుతం క్షేమంగా వున్నారని... అయినప్పటికీ ఆందోళనగానే వుందన్నారు. టెన్షన్ పడొద్దని.. బాగానే వున్నామని తమతో చెప్పాడని అజయ్ తల్లి ప్రేమలత అన్నారు. అజయ్తో పాటు ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులను వెనక్కి తీసుకురావాలని ఆమె కోరారు.
కాగా తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని మారుతిరావు కిరాయి హంతకులతో హత్య చేయించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చిన మారుతీరావు.. 2020 మార్చిలో ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు