కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై

Published : Nov 02, 2019, 10:29 PM ISTUpdated : Nov 02, 2019, 10:49 PM IST
కేసీఆర్: ఏమైతది.. ఆర్టీసీ ఉండదు, కోదండరామ్, రేవంత్ రెడ్డిలకు రిప్లై

సారాంశం

ఆర్టీసీపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఎలా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆర్టీసీ విభజన జరిగిందని చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. శనివారం రాత్రి మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కోదండరామ్, రేవంత్ రెడ్డిల వ్యాఖ్యలకు ఘాటైన సమాధానం ఇచ్చారు. వారి పేరెత్తకుండా కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసారు. ఒక్క సీటు కూడా గెలవలేనివారు మాట్లాడుతున్నారని, నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది మాట్లాడితే ఎలా అని కేసీఆర్ అడిగారు. రేవంత్ రెడ్డికి మాత్రమే కాకుండా కోదండరామ్ కు కూడా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఒక్క సీటు కూడా గెలువలేని వారు కూడా ప్లాట్ ఫారం స్చీచ్ లు ఇస్తున్నారని ఆయన కోదండరామ్ ను ఉద్దేశించి అన్నారు.

అది ఫ్లాట్ ఫామ్ స్పీచ్ అని, ఫ్లాట్ ఫాం మీద ఎంతైనా మాట్లాడవచ్చునని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ 9వ షెడ్యూల్ లో ఉందని ఆయన పెండింగ్ సబ్జెక్ట్ అని అంగీకరిస్తూనే కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఆర్టీసీ అనేది నిత్యం జరిగే సంస్థ అని తాము చెప్పామని, దాంతో ఏ రాష్ట్రం ఆర్టీసీని వారు ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం చెప్పిందని, తెలుసుకోకుండా.. జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎలా అని ఆయన అన్నారు. 

Also Read: ఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

ఆర్టీసీలోని పెండింగ్ అంశాలను పక్కన పెట్టి, ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఆర్టీసిని ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం చెప్పిందని, ఆ మేరకు తెలంగాణ ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని, నోటిఫై కూడా చేశామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే తెలంగాణ ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని ఆయన చెప్పారు. నోటిఫై చేసి తెలంగాణ ఆర్టీసీని మనుగడలోకి తెచ్చామని ఆయన అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర విభజన చట్టం మేరకు తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రభుత్వంలో విలీనం అయినట్లేనని రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఆర్టీసీ సకల జనుల సభలో అన్నారు. కోదండరామ్ కూడా అదే మాట అన్నారు. ఆర్టీసీ జెఏసి కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తాజాగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు ప్రస్తావించినప్పుడు కేసీఆర్ ఆ వివరణ ఇచ్చారు. 

ఈ నెల 5వ తేదీలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే అలా అని మీడియా ప్రతినిధులు అడిగితే.. ఏమవుతుంది.. ఆర్టీసీ ఉండదు అని కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం 5వేల ప్రైవేట్ బస్సులను తీసుకుంటున్నామని, మిగతా బస్సులను కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు ఇస్తామని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్ లో ఆర్టీసీ ఉందా, లేదు కదా, అదే అవుతుందని ఆయన అన్నారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని, ఇప్పటికే సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటించామని, కార్మిక శాఖ సమ్మెను చట్టవిరుద్ధమని ప్రకటిస్తే ఉద్యోగి, యజమానికి మధ్య ఏ విధమైన సంబంధం ఉండదని, నూతన చట్టం అదే చెబుతోందని ఆయన అన్నారు. తాము మంచివాళ్లం కాబట్టి కార్మికులకు ఇంకా అవకాశం ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఉద్యోగులు ఉద్యోగాలు ఉండగానే రిటైర్ అయ్యారని, దానికి వారు అనుభవిస్తారని ఆయన అన్నారు. 

Also Read: 5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

ఆర్టీసీ దివాళా తీసిందని తాను అనలేదని, దివాళా తీసే పరిస్థితి ఉందని మాత్రమే చెప్పానని, అలా జరగకుండా చూడాలని చర్యలు తీసుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు. మేం చెడగొడుతాం, ఎలా బతికిస్తారో బతికించండని అని అంటే ఏం న్యాయమని ఆయన అన్నారు. ఆర్టీసీ దివాళా తీసే సమయంలో అహంకారపూరితంగా సమ్మెకు పిలుపునిచ్చారని ఆయన అన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించి తీరుతామని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu