RTC strike: అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు

By telugu teamFirst Published Oct 25, 2019, 2:09 PM IST
Highlights

ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్ధామ రెడ్డి కారకుడని కూకట్ పల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే కార్మికుడు ఫిర్యాదు చేసాడు

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్ధామ రెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్ధామ రెడ్డి కారకుడని కూకట్ పల్లి డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న రాజు అనే కార్మికుడు ఫిర్యాదు చేసాడు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే అర్థం పర్థం లేని డిమాండుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆ ఫిర్యాదులో రాజు పేర్కొన్నాడు. 

నిన్న సాయంత్రం హుజూర్ నగర్ ఉపఎన్నిక విజయం తరువాత కెసిఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆర్టీసీ యూనియన్ నేతలపై,ఆర్టీసీ సమ్మెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కెసిఆర్ నిన్నటి ప్రెస్ మీట్ లో యూనియన్ నాయకులు ఆర్టీసీ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ అనే సంస్థ ఉండనే ఉండదని కెసిఆర్ నిన్న అన్న విషయం మనకు తెలిసిందే. 

కెసిఆర్ నిన్నటి ప్రెస్ మీట్ తరువాత ఈ పరిణామం చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇన్ని రోజులు ఉద్యమానికి సపోర్ట్ చేసిన కార్మికుడు ఇప్పుడు బయటకొచ్చి కేసు పెట్టాడు. 

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. తిన్నది అరక్క చేస్తున్న సమ్మె అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీపై రూ.5000 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. నెలకు రూ.1200 కోట్లు నష్టం వస్తుందని చెప్పుకొచ్చారు. 

ఆర్టీసీ అభివృద్ధి కోసం గంట పనిచేయమంటే చేయరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలలో ఒక కిలోమీటర్ పనితనం తగ్గించాలని యూనియన్ నేతలు చేస్తున్న డిమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరికీ రూ.50వేలు జీతం వస్తుందన్నారు. 

నెలకు రూ.5వేలు జీతం కూడా అందని వారు అనేకమంది ఉన్నారని చెప్పుకొచ్చారు. అన్నమో రామచంద్ర అని ఎంతోమంది ఏడుస్తుంటే మీకు వేలకు వేలు జీతాలు ఇస్తున్నప్పుడు కనీసం ఒక గంట పనిచేయరా అని నిలదీశారు. 

టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఐదేళ్లలో రూ.712 కోట్లు ఇచ్చారని మండిపడ్డారు. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బలోపేతానికి రూ.4,250 వేల కోట్లు ఇచ్చినట్లు  కేసీఆర్ స్పష్టం చేశారు. సంవత్సరానికి రూ.950 కోట్లు ఆర్టీసికి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.550 కోట్లు ప్రవేశపెట్టామని అయితే రూ.445 కోట్లు ఇచ్చేసినట్లు తెలిపారు. 

ఆర్టీసీకి డీజిల్ కి డబ్బులు లేవు, చచ్చిపోతాం, కడుపుఖాళిపోతుంది అని మీదపడితే డబ్బులు విడుదల చేసినట్లు తెలిపారు. పండుగ సమయంలో ఆర్టీసీ బస్సులను తిప్పాల్సింది పోయి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ సమ్మెకు వెళ్లారని కేసీఆర్ మండిపడ్డారు. 

రెండు నెలల ముందే సమ్మె నోటీసులు ఇచ్చామంటూ యూనియన్ నేతలు లంగ ప్రచారం చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై తాము వెనకడుగు వేయలేదని స్పందించామన్నారు.  

ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ అధికారుల కమిటీ చర్చలు జరిపిందన్నారు. ఆర్టీసీ విలీనం చాలా సమయం పడుతుందని అది చాలా కష్టమైన సమస్యమని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సమ్మెకు వెళ్లవద్దని అధికారుల కమిటీ సూచించినప్పటికీ యూనియన్ నాయకులు పట్టించుకోలేదన్నారు. 

తాము చెప్తున్నా పట్టించుకోకుండా యూనియన్ నాయకులు సమ్మెకు వెళ్లారంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో దసరా పండుగ ఎంతో పవిత్రమైందని ఆ పండుగకు ఆర్టీసీకి అదనంగా రూ.150 కోట్లు ఆదాయం వచ్చేదని చెప్పుకొచ్చారు. 

కానీ ఆ అదనపు ఆదాయానికి యూనియన్ నాయకులు గండికొట్టారని మండిపడ్డారు కేసీఆర్. గతంలో రోజుకు రూ.10 కోట్లు వచ్చేదని ఇప్పుడు ప్రస్తుతం కోటి రూపాయలు నష్టం వస్తుందన్నారు. రోజుకు రూ.5కోట్లు ఖర్చు అవుతుందంటే నాలుగు కోట్లు వస్తుందని ఫలితంగా కోటి రూపాయలు నష్టమన్నారు. 

ఆర్టీసీ మనుగడ బాధ్యత రాష్ట్రప్రభుత్వాలకే వదిలేస్తూ కేంద్రం ఇటీవలే చట్టం చేసిందని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ నుంచి ఈ చట్టం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్నారు. ప్రభుత్వం నిర్ణయంపైనే ఆర్టీసీ మనుగడ ఉంటుందని చెప్పుకొచ్చారు కేసీఆర్. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్

click me!