ప్లాన్ ప్రకారం ఇంట్టో అద్దెకు..మత్తుమంది ఇచ్చి దోపిడీ

By Nagaraju TFirst Published Oct 1, 2018, 3:21 PM IST
Highlights

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వృద్ధదంపతులకు మత్తుమందు ఇచ్చి ఇంట్లో నగదు నగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనలో భర్త మరణించగా భార్య ఆపస్మారక స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 

కామారెడ్డి:కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బీసీవాడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వృద్ధదంపతులకు మత్తుమందు ఇచ్చి ఇంట్లో నగదు నగలు అపహరించుకుపోయారు. ఈ ఘటనలో భర్త మరణించగా భార్య ఆపస్మారక స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళ్తే బీసీకాలనీలో శంకరయ్య, ఇందిరమ్మ దంపతులు నివశిస్తున్నారు. పది రోజుల క్రితం వాళ్ళ ఇంట్లోకి ఓ జంట అద్దెకు దిగింది. 

వారు ఆ వృద్ధ దంపతులతో ప్రేమగా మాట్లాడుతూ వారిని ఆకట్టుకున్నారు. రోజులాగే ఆదివారం రాత్రి వృద్ధ దంపతులకు మత్తుమందు కలిపిన కల్లు తాగించారు. దీంతో వృద్ధ దంపతులు కుప్పకూలిపోయారు. వృద్ధ దంపతులు మత్తులోకి జారుకోవడంతో ఆ ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. 

అయితే భార్య ఇందరమ్మకు తెల్లవారు జామున మెలకువ రావడంతో లేచి చూసేసరికి శంకరయ్య నోట్లో నుంచి రక్తం కక్కుతూ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇందిరమ్మ తోటి వారి సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా శంకరయ్య మృతిచెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. భర్త మరణ వార్తవిన్న ఆ వృద్ధురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. 

కేసు నమోదు చేసిన ఎల్లారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే ఇంట్లో అద్దెకు దిగి దోపిడీకి పాల్పడ్డారని ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. దొంగతనం కేసును ఛేదించేందుకు రెండు బృందాలు పనిచేస్తున్నాయి. ఈ బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. 
  

click me!