
కోరుట్ల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సుమారు రూ. రెండు కోట్లకు కుచ్చుటోపి వేసి పరారైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రిక్షా నడుపుకోవడానికి సుమారు పాతిక సంవత్సరాల క్రితం కోరుట్ల వచ్చాడు.
"
కాలనీలో ఓ ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడు. ఇటీవల సుమారు రూ.50 లక్షలకు ఆ ఇంటిని విక్రయించినట్లు సమాచారం. ప్రస్తు తం పట్టణంలోని ఓ కాలనీలో అద్దె గదిలో ఉంటూ రిక్షా నడుపుకుంటూనే.. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానంటూ పలువురి వద్ద రూ. రెండు కోట్ల వరకు అప్పు పేరిట వసూలు చేశాడు.
సుమారు ఇరవై మంది వ్యక్తుల వద్ద అధిక వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మ బలికి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు అప్పు పేరిట వసూలు చేశాడు.
అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో పలువురు వ్యాపారులు, మధ్య తరగతి వ్యక్తులు అతనికి అప్పులు ఇచ్చారు. సుమారు రెండు కోట్ల వరకు వసూలు చేసిన ఆ వ్యక్తి ప్రస్తుతం కనిపించకపోవడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
సదరు వ్యక్తి ఆచూకీ కోసం ఆరా తీసినా లాభం లేకపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బాధితులు ఉన్నారు. సదరు వ్యక్తి నివాస ముంటున్న అద్దె ఇంటికి తాళం వేసి ఉండటం, సెల్ఫోన్ పనిచేయక పోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది కోరుట్లలో వడ్డీ వ్యాపారులపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న వడ్డీ వ్యాపారాన్ని అరికట్టడంలో పోలీసులు పట్టించుకోకపోవడంతో మళ్లీ వడ్డీ వ్యాపారం ఊపందుకుంది.
వడ్డీ వ్యాపారులను సైతం మోసం చేస్తూ ఓ రిక్షా పుల్లర్, రియల్ ఏస్టేట్ వ్యాపారి సుమారు రూ. రెండు కోట్లకు కుచ్చుటోపి వేయడం కోరుట్లలో చర్చనీయాంశంగా మారింది.