
తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మరోమారు కేసిఆర్ ఫ్యామిలీపై విరుచుకుపడ్డారు. ప్రజల్లో రోజు రోజుకూ దిగజారిపోతున్న తన కుటుంబ ప్రతిష్టను కాపాడుకునేందుకు కేసిఆర్ కుటుంబం అవార్డుల వెంట పడిందని రేవంత్ విమర్శించారు. వారందరికీ అవార్డుల పిచ్చి పట్టుకుందని ఎద్దేవా చేశారు.
మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం, గూడెం గ్రామానికి చెందిన దళిత యువకులు మహాంకాలి శ్రీనివాస్, పరసురాములు మూడెకరాల భూపంపిణీలో అవకతవకలు జరిగాయని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. సోమవారం వారిని పరామర్శించేందుకు రేవంత్ రెడ్డి యశోద ఆసుపత్రికి వెళ్లగా ఆసుపత్రి యాజమాన్యం ఆయనను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు.
కేసిఆర్ కుటుంబంలో కేసిఆర్ కు, కేటిఆర్ కు, కవితకు, హరీష్ రావుకు రోజుకో అవార్డు వచ్చిందని సొంత మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దిళితులు, గిరిజనులు అల్లాడిపోతుంటే కేసిఆర్ కుటుంబం మాత్రం అవార్డుల ఆనందంలో మునిగిపోయిందని విమర్శించారు.
అయ్యకు అగ్రికల్చర్ అవార్డు, బిడ్డకు నారీ ప్రతిభా పురస్కార్, కొడుకుకు ఐటిలో ఈయన అంత మొగోడు ఇంకెవరూ లేరని మేటి ఐటి మంత్రి అవార్డులు వచ్చాయని ఘాటుగా వ్యాఖ్యానించారు రేవంత్. గతంలో రవీంద్ర భారతిలో సన్మానాలు చేసే బాపతు వ్యక్తులు ఉండేవారని, వారు చేసే సన్మానానికి ఇంత, దండగలకు ఇంత, శాలువాలకు ఇంత, చప్పట్లకు ఇంత అన్నట్లుగా ప్యాకేజీలు ఇచ్చేవారని గుర్తు చేశారు రేవంత్. ప్రస్తుతం కేసిఆర్ కుటుంబానికి వస్తున్న అవార్డులను చూస్తే అటువంటి ప్యాకేజీల సన్మానాలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు.
కేసిఆర్ కు ప్రయివేటు సంస్థ అవార్డు ఇస్తే అదేదో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారని, తర్వాత తాము ఎత్తిచూపితే మాటమార్చారని చెప్పారు. బిడ్డకు అవార్డు ఇచ్చిన సంస్థ ఇక్కడికే వచ్చి సన్మానం చేసి పోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఇప్పటికైనా కేసిఆర్ కుటుంబం అవార్డుల పిచ్చి వదిలి దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి