
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ టార్గెట్గా ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదంటూ కేటీఆర్పై సెటైర్లు వేశారు. ‘‘వ్యవ’సాయం’ అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు.. ఎవుసం అంటే జూబ్లిహిల్స్ గెస్ట్ హౌజ్లలో సేద తీరడం కాదు… సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు… అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ. ఎడ్లు - వడ్లు అని ప్రాసకోసం పాకులాడే … ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన’’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్కు రాహుల్ పొలం ట్రాక్టర్ నడుపుతూ, వరి నాట్లు చేస్తున్న ఫొటోలను కూడా రేవంత్ జత చేశారు.
ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్ అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చే స్క్రిప్టు మాత్రమే ఆయన చదువుతారని.. ఆయనకు తెలంగాణపై అవగాహన లేదని మండిపడ్డారు. రూ. 80 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుంది? అని ప్రశ్నించారు. రాహుల్కు ఎడ్లు తెలువదు, వడ్లు తెలువదు.. క్లబ్బులు, పబ్లు మాత్రమే తెలుసని వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాహుల్గాంధీని దేశంలో ఏమంటారో అందరికీ తెలుసనని కామెంట్ చేశారు.
అయితే రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్ధరహితమని టీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి కేటీఆర్కు లేదన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే ముందు .. కేటీఆర్కు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలని ప్రశ్నించారు. ఒక వేలు రాహుల్ గాంధీ వైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు కేటీఆర్ వైపు చూపిస్తాయని అన్నారు.