
దేశంలో బీజేపీ ఎత్తుగడలను తిప్పికొట్టేందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ విచారణ పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. మానవత్వం లేకుండా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని వేధించారని అన్నారు. సోమవారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇస్తుందని ఆరోపించారు.
రాహుల్ గాంధీ పాదయాత్రను ఏమీ చేయలేక కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. యాత్ర జరిగే ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. బెదిరించడానికే సీనియర్ నేతలకు ఈడీ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈడీ నోటీసుల పేరుతో ఢిల్లీకి పిలుస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు గీతా రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్లకు ఈడీ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఈడీని బీజేపీ ఎన్నికల నిర్వహణ చేసే ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మార్చిందని ఆరోపించారు.