తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను బలహీనపరచాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కుమారస్వామి పార్టీని విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ను బలహీనపరచాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కుట్రలో భాగంగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్లు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నవారినే కేసీఆర్ కలుస్తున్నాడని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీఏస్పీ అధినేత్రి మాయవతి, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలను కేసీఆర్ ఎందుకు కలవరని నిలదీశారు. కాంగ్రెస్తో కలిసి ఉన్న పార్టీల నేతలనే కేసీఆర్ కలవడం వెనక అంతర్యమేమిటని ప్రశ్నించారు.
Also Read: కేసీఆర్తో మూడు గంటల పాటు కుమారస్వామి భేటీ: జాతీయ రాజకీయాలపై చర్చ
ఇదిలా ఉంటే.. కేసీఆర్తో నేడు కుమారస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ఇరువురు నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇరువురు నేతల మధ్య దాదాపు మూడు గంటల పాటు సమావేశం సాగింది. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.
తమతో కలిసి రావాలని కుమారస్వామిని కేసీఆర్ కోరినట్టుగా తెలుస్తోంది.
ఇక, కేసీఆర్తో సమావేశం కోసం కుమారస్వామి శనివారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. రాత్రి హోటల్ గ్రాండ్ కాకతీయలో ఆయన బస చేశారు. ఈ రోజు ఉదయం హోటల్ గ్రాండ్ కాకతీయకు వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. కుమారస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు నేతలు కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు.