ఖమ్మం సీటుపై పేచీ.. ప్రియాంక గాంధీ పోటీ చేయాలని సీఎం విజ్ఞప్తి

By Mahesh KFirst Published Mar 28, 2024, 5:10 PM IST
Highlights

ఖమ్మం సీటుపై కాంగ్రెస్‌లో పేచీ నెలకొంది. ఇటు డిప్యూటీ సీఎం భట్టి, అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం టికెట్ కోసం ఆశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలబెట్టాలని కోరారు.
 

కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో నాలుగు లోక్ సభ నియోజకర్గాలకు బుధవారం అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి, భోనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ (ఎస్టీ) నుంచి డాక్టర్ సుగుణ కుమారి చెలిమలను ప్రకటించింది.

ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో బుధవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మిగిలిన లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని భావించింది. కానీ, అన్ని స్థానాల్లో ఏకాభిప్రాయాలు కుదరలేవు. దీంతో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థులను తేల్చడానికి మార్చి 31వ తేదీన మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. 

ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు హాజరయ్యారు.

మొత్తం 17 స్థానాలకు ఇప్పటికే కాంగ్రెస్ 9 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. బుధవారం మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉన్నది. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉన్నది. ఇందులో ఖమ్మం సీటు కాంగ్రెస్ దాదాపుగా గెలుచుకునే సీటు. అందుకే దానిపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు.

డిప్యూటీ సీఎం భట్టి ఈ స్థానం నుంచి తన భార్య నందినిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డిలను నిలబెట్టాలని చూస్తున్నారు. ఈ సీటు నుంచి పోటీ చేసే అభ్యర్థిపై ఏకాభిప్రాయాలు కుదరలేవు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు.

click me!