
గణేష్ నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రోలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రో సేవల సమయాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి శనివారం తెల్లవారుజామున 2 గంటల వరకు మెట్రో రైళ్లను నడిపారు. నగంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో.. వినాయక నిమజ్జనం వీక్షించేందుకు వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో మెట్రో రైళ్లను ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే నిన్న ఒక్కరోజే మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించారని హైదరాబాద్ మెట్రో అధికారులు వెల్లడించారు. మియాపూర్- ఎల్బీనగర్ కారిడార్లో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గం కారిడార్లో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లో 22 వేల మంది ప్రయాణించారు. అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్లో 22 వేల మంది రైలు ఎక్కగా.. 40 వేల మంది రైలు దిగారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద రెండు రోజు గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. హైదరాబాద్ నలుమూలల నుంచి నిమజ్జనానికి గణేష్ విగ్రహాలు తరలివస్తున్నాయి. అధికారులు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, సంజీవయ్య పార్క్, ట్యాంక్ బండ్ రోడ్లపైకి గణనాథులను తరలిస్తున్నారు. వేగంగా నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ రోజు రాత్రి వరకు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు సాధారణ వాహనదారులకు ఇబ్బంది లేకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
ఇక, శుక్రవారం ఉదయం హుస్సేన్ సాగర్లో భారీగా గణేష్ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసరాలు సందడిగా మారాయి. గణేష్ శోభాయాత్ర సాగుతున్న మార్గం.. జై బోలో గణేష్ మహారాజ్.. నినాదాలతో మారుమోగుతుంది. రాత్రి 7 గంటల సమయంలో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తయింది. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర నిర్వహించి.. అనంతరం ట్యాంక్ బండ్లోని క్రేన్ నంబర్ 4 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. దాదాపు 20 కి.మీ దూరం నుంచి శోభాయాత్ర హుస్సేన్ సాగర్కు చేరుకున్న బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని రాత్రి 10.32 గంటలకు క్రేన్ నంబర్ 6 వద్ద నిమజ్జనం చేశారు. అనంతరం మిగిలిన గణనాథుల నిమజ్జన ప్రక్రియ వేగవంతమైంది.