
సాయుధ రైతాంగ పోరాటాల ద్వారానే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నైజాం నిరంకుశత్వంపై మొదలైన తిరుగుబాటు సాయుధ రైతాంగ పోరాటంగా మారిందని అన్నారు. ఇది ఉధృత రూపం చెందుతున్న తరుణంలోనే ఇది యావత్ భారత దేశానికి వ్యాప్తి చెందుతుందని భయంతో బ్రిటిష్ పాలకులు దేశం నుండి తోక ముడిచారని తెలిపారు. దీనికి దివంగత కమ్యూనిస్టు నాయకుడు భీం రెడ్డి నరసింహా రెడ్డి చేసిన తిరుగుబాటు ప్రధాన కారణంగా నిలిచిందని అన్నారు.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నిర్మాత, మార్కిస్టు కమ్యూనిస్టు నేత భీంరెడ్డి నరసింహా రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మంత్రి జగదీష్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మంత్రి మాట్లాడారు. నైజాం నిరంకుశత్వంపై మొట్టమొదటి సారిగా తిరుగుబావుటా జరిపిన నేతగా భీంరెడ్డి నర్సింహారెడ్డి చరిత్ర సృష్టించారని తెలిపారు. అలాంటి చరిత్రను నలు దిశలా వ్యాపింపజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
దోపిడీ పాలన అంతానికి అగ్గి రాజేసిన మహాయోధుడు బీఎన్ రెడ్డి కీర్తించబడుతున్నారని మంత్రి అన్నారు. అలాంటి మహానేత స్ఫూర్తి వర్తమానానికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఆయన స్ఫూర్తి ప్రతిబింబించేలా సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వచ్చే వర్థంతి నాటికి ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ద్వారానే యావత్ భారతదేశంలో ప్రజా చైతన్యం రగిలిందని అన్నారు. భారతదేశం బానిస మనస్తత్వంతో వెట్టి చాకిరిలో మగ్గుతున్న కాలంలో భూస్వామ్య కుటుంబం నుండి వచ్చిన భీంరెడ్డి నర్సింహారెడ్డి తన చుట్టు ఉన్న వారి పరిస్థితులను అధ్యయనం చేసి అసహ్యం వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. దోపిడి పాలన అంతం కసం తనకున్న యావదాస్తిని ప్రజల కోసం త్యాగం చేసిన మహానీయుడు ఆయన అని మంత్రి గుర్తు చేశారు.
పాత సూర్యాపేట తాలూకాతో పాటు తుంగతుర్తి, జనగామ ప్రాంతంలో ఇప్పటికీ భీంరెడ్డిని కొలుస్తుంటారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. తనకు జన్మనిచ్చిన ప్రాంతంలో గోదావరి నది జలాలు పారి, ఇక్కడి నేలంతా సస్యశ్యామలం కావలన్నదే ఆయన తపన అని చెప్పారు. ఆ తపనను సీఎం కేసీఆర్ కాళేశ్వరం ద్వారా సాకారం చేశారని కొనియాడారు. ఆయన వెంట రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఇతర నాయకులు ఉన్నారు.