
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు. ఏఐసీసీ స్ట్రాటజిక్ మీటింగ్ సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతూ.. పార్టీ అంతర్గత విషయాలపై మీడియాకు ఎక్కొద్దని రాహుల్ హెచ్చరించారు. సమస్యలను మల్లిఖార్జున ఖర్గే, వేణుగోపాల్ లేదా తనతో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. ఇద్దరిపై వేటు వేస్తే అంతా సెట్ అవుతుందని.. ఈసారి ఎవరు మీడియాకు ఎక్కినా చర్యలు తప్పవన్నారు. తెలంగాణలో ఇద్దరు దొరికేలా వున్నారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కావాలా.. మీడియాలో కనబడటం కావాలా అంటూ ఆయన ప్రశ్నించారు.
కాగా.. తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దెదించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల టార్గెట్గానే సమావేశం జరిగిందని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిస్థితులపై ఫోకస్ చేయాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఏఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది చర్చించడం జరిగిందని చెప్పారు.
ఎన్నికలకు సిద్దం కావాలని రాహుల్ గాంధీ ఆదేశించారని తెలిపారు. విభేదాలు వీడి ఎకతాటిపైకి వచ్చి పనిచేయాలని సూచించారని చెప్పారు. సమావేశంలో ప్రతి నేతతో మాట్లాడారని.. సలహాలు స్వీకరించడంతో పాటు సూచనలు చేశారని తెలిపారు. తెలంగాణ ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరుకు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలు ఆశించిన విధంగా జరగడం లేదని అన్నారు.
ALso Read: కర్ణాటక తరహా వ్యూహంతో ముందుకు.. బీఆర్ఎస్తో పొత్తుకు అవకాశమే లేదు: కాంగ్రెస్ నేతలు
ప్రజల సొమ్మంతా ఒక పార్టీ ప్రచార ఖర్చుకే సరిపోతుందని విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ను గద్దె దించి.. కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్తో కాంగ్రెస్కు ఎప్పుడూ ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేశారు.