
హైదరాబాద్: సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ వంద రోజులు దాటిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్లో మార్చి 16వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర నిరాటంకంగా పలు జిల్లాల గుండా సాగుతున్నది. పేద ప్రజలు, అట్టడుగు వర్గాలను కలుపుతూ ఆయన యాత్ర దిగ్విజయంగా సాగుతున్నది. ఈ యాత్ర కాంగ్రెస్ అధిష్టానం దృష్టినీ ఆకర్షించింది.
కర్ణాటక ఎన్నికలతో జోష్ మీదున్న కాంగ్రెస్ తెలంగాణలో తదుపరి విజయాన్ని నమోదు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు ఇక్కడి రాజకీయ పరిణామాలను తెలుసుకుంటున్నారు. సర్వేలు పరిశీలిస్తున్నారు. ఆ నివేదికల ఆధారంగా రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దృష్టికి భట్టి విక్రమార్క పాదయాత్ర వెళ్లింది. ఈ యాత్ర గురించి రాహుల్ గాంధీ ఆరా తీశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సహా ముఖ్య నేతల నుంచి ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గురించి పాజిటివ్ కోణంలో అభిప్రాయాలు వెళ్లాయి. దీంతో రాహుల్ గాంధీ భట్టిని ప్రశంసించినట్టు తెలిసింది.
Also Read: జులై 13న చంద్రయాన్ 3 ప్రయోగం.. ప్రకటించిన ఇస్రో
గ్రామీణ ప్రాంత సమస్యలపై భట్టి విక్రమార్క ఎక్కువ దృష్టి పెట్టారు. వీటిపైన భట్టి స్పందిస్తున్న తీరు ప్రజలకు ఆయనపై, పార్టీపై విశ్వాసాన్ని పునరుద్ధరించేలా చేస్తున్నదని నివేదికలు ఆయనకు అందాయి. ఈ పాదయాత్రతో తప్పకుండా కాంగ్రెస్కు ఆదరణ పెరుగుతుందని, పార్టీకి కలిసివస్తుందని పేర్కొన్నాయి. అనంతరం, రాహుల్ గాంధీ ప్రశంసించినట్టు సమాచారం.
జులై 2వ తేదీన ఈ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ స్వయంగా హాజరుకాబోతున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు.