తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. పార్టీ అధ్యక్షుడి మార్పు అనేది ఊహాగానమేనని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ తన సొంత పార్టీని చూసుకోకుండా పక్కపార్టీకి పొగపెడుతున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడి మార్పు అనేది ఊహాగానమేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు విషయం నడ్డాను అడిగి తెలసుకోవాలని, నడ్డాకు ఫోన్ చేసి మీరే కనుక్కోవాలంటూ బండి సంజయ్ మీడియా ప్రతినిధులపై సెటైర్లు వేశారు.
అటు హుజురాబాద్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఈటల రాజేందర్ హత్యకు కుట్ర పన్నారంటూ ఆయన సతీమణి జమున చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బండి సంజయ్. ఈటల భద్రతపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. గతంలో తనపైనా, రాజా సింగ్, ధర్మపురి అర్వింద్ లపై దాడులు చేసి హతమార్చేందుకు యత్నించారని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాపై దాడులు చేసి, కుట్రపన్నిన వ్యక్తులను వదిలి మాపై కేసులు పెట్టి మమ్మల్ని జైళ్లలోకి పంపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపారీ ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంకా బయట తిరుగుతున్నాడని, మీడియాతో మాట్లాడుతున్నాడని సంజయ్ వ్యాఖ్యానించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, హోంమంత్రి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
ALso Read: తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు ప్రచారం.. తరుణ్ చుగ్ రియాక్షన్ ఇదే..
కాగా.. తెలంగాణలో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలసిందే. తెలంగాణ బీజేపీలోని పలువురు నేతలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీరుపై అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు చోటుచేసుకుందనే ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది. అయితే ఈ ప్రచారంపై తెలంగాన బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. అధ్యక్ష మార్పు అంశం బీజేపీ హైకమాండ్ దృష్టిలో లేదని స్పష్టం చేశారు. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో ముఖ్య నేతలందరికీ కీలక బాధ్యతలు ఉంటాయని అన్నారు.