prathyusha garimella: ప్రత్యూష గరిమెళ్లది ఆత్మహత్యే.. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తేల్చిన పోలీసులు

By Siva KodatiFirst Published Jun 11, 2022, 8:24 PM IST
Highlights

అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్లది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. 
 

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (prathyusha garimella) మృతదేహానికి ఉస్మానియాలో (osmania hospital) పోస్ట్‌మార్టం పూర్తయ్యింది. దీంతో ఆమెది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. విష వాయువు పీల్చడం వల్లే ప్రత్యూష శ్వాస ఆగిపోయినట్లు గుర్తించారు. రేపు హైదరాబాద్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. 

కాగా.. భారతదేశంలోని టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ప్రత్యూష ఒకరు. టాలీవుడ్, బాలీవుడ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష బయటకు రాకపోవడంతో రెసిడెన్సీ వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో వాచ్ మన్ తలుపులు తట్టాడు. అయితే తలుపులు తెరుచుకోకపోవడంతో పోలీసులకు శనివారం మధ్యాహ్నం సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించగా... ప్రత్యూష శవం బాత్రూంలో పడి ఉంది. మృతదేహం పక్కనే కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ పడి ఉంది. ఆ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Latest Videos

ALso Read:‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు.. వారికి క్షమాపణలు: సూసైడ్ నోట్ లో ప్రత్యూష

అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన ప్రత్యూష హైదరాబాదుకు వచ్చి ఇక్కడై స్థిరపడింది. పదేళ్లుగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల కోసం పనిచేస్తూ వస్తోంది. ఇండియాలోనే ప్రముఖ డిజైనర్ గా ఆమె పేరు సంపాదించుకుంది. 39 ఏళ్ల ప్రత్యూష గరిమెళ్ల ఒంటరి జీవితం సాగిస్తున్నారు. ఆమె డిప్రెషన్ కు గురి కావడానికి గల కారణమేమిటనేది చెప్పలేకపోతున్నారు. 

సినీ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణితి చోప్రా, మాధురీ దీక్షిత్, కాజోల్, విద్యా బాలన్, రవీనా టాండన్, నేహా దూపియా, శ్రుతి హాసన్, హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా, క్రుతి కర్బంద వంటివారికి ఫ్యాషన్ డిజైనర్ గా ప్రత్యూష గరిమెళ్ల పనిచేశారు. టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా ఆమె పనిచేశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో ఆమెకు బోటిక్ ఉన్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు ప్రత్యూష గదిలో సూసైడ్ నోట్ లభించింది. ‘‘తాను కోరుకున్న జీవితం ఇది కాదని.. ఇకపై తల్లిదండ్రులకు భారం కాలేను, క్షమించండి’’ అంటూ ప్రత్యూష రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తాను స్వేచ్చను కోరుకున్నానని.. తాను ఎవ్వరికీ భారం కాదల్చుకోలేదని ప్రత్యూష పేర్కొన్నారు. డిప్రెషన్ నుంచి అనేక సార్లు బయటకు రావాలని ప్రయత్నించానని.. ప్రతిరోజూ తాను బాధపడుతూనే వున్నానని ఆమె లేఖలో ప్రస్తావించారు.
 

click me!