బండరాళ్లను చూసి సరదా పడితే.. ఇరుక్కుపోయి తంటా.. పోలీసుల చాకచక్యంతో ప్రాణాలతో బయటపడ్డాడు..

By SumaBala BukkaFirst Published Jan 31, 2023, 9:26 AM IST
Highlights

సరదాగా బండరాళ్లు ఎక్కి, కాలు జారి వాటిమధ్య ఇరుక్కుపోయిన ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా కాపాడారు. ఈ ఘటన తిరుమలగిరి పరిధిలో చోటు చేసుకుంది. 

తిరుమలగిరి : ఓ యువకుడి సరదా అతడి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. దీంతో అక్కడి నుంచి బయటికి రాలేక..  అక్కడే ఉండి ప్రాణాలు పోలేక తీవ్ర ఇబ్బంది పాలయ్యాడు. చివరికి  పోలీసుల జోక్యంతో దాదాపు మూడు గంటల తర్వాత బతుకు జీవుడా అని బయటపడ్డాడు. ఈ ఘటన తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.  దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… రాజు(26)అనే యువకుడు మహారాష్ట్రకు చెందిన  వ్యక్తి. బతుకు తెరువు వెతుక్కుంటూ హైదరాబాదు నగరానికి వచ్చాడు.

తిరుమలగిరి కేన్ కాలేజీ సమీపంలో ఉండే ఖాళీ ప్రదేశానికి సోమవారం సాయంత్రం వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద బండలు ఉండడంతో వాటిని చూసి సంతోషంతో వాటి మీదకి ఎక్కాడు. ట్రెక్కింగ్ లాగా చేస్తూ పైదాకా వెళ్ళాడు… కాగా, అక్కడికి వెళ్లాక ఒక్కసారిగా పట్టు తప్పింది. దీంతో రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు. బయటికి ఎలా రావాలో తెలియలేదు. గట్టిగా కేకలు వేశాడు. అతడి కేకలు స్థానికులు గుర్తించారు. దగ్గరికి వచ్చి గమనించి..  తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. విచిత్రమైన ఈ ఘటన మీద తిరుమల పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్.. సీఎం క్యాంపు ఆఫీస్ లోని వ్యక్తికి సీబీఐ నోటీసులు..

తమకు సమాచారం అందగానే కానిస్టేబుళ్లు భాషా, రాంబాబు, రాజు ఆ రాళ్లు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అత్యంత దగ్గరగా ఉన్న రెండు రాళ్ల మధ్య రాజు ఇరుక్కుపోవడంతో ఎలా బయటికి తేవాలో అంచా వేశారు. కాస్త అటూ, ఇటూ అయినా ప్రాణాలకే ప్రమాదం అని గ్రహించారు. దీంతో అతి జాగ్రత్తగా అతని భుజానికి తాళ్లు కట్టి..  చాలా కష్టపడి బయటకు లాగారు.  ఈ క్రమంలో రాజుకు కొద్దిగా గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించిన తర్వాత సోమవారం రాత్రి అతనిని సొంతూరుకు వెళ్ళమని చెప్పి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వదిలేశారు. ఈ ఘటనలో రాజును జాగ్రత్తగా కాపాడిన కానిస్టేబుల్ లను సీఐ శ్రవణ్ కుమార్ అభినందించారు. 

click me!