నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై కేసు నమోదు చేశారు.
నల్లగొండ: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డిపై పోలీసుుల కేసు నమోదు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణపై ఆయన మీద కేసు నమోదు చేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
నామినేషన్ దాఖలు సందర్భంగా నిబంధనలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారని, ఫ్లెక్సీలు ప్రదర్శించారని, డీజెను ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవి పోటీ చేస్తున్నారు.
మార్చి 14వ తేదీన ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ వివిధ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.