ఇదేందయ్యా ఇదీ... చాక్లెట్ దొంగిలిస్తే ఇన్ని కేసులా...!

By Arun Kumar PFirst Published Jan 25, 2024, 1:04 PM IST
Highlights

చాక్లెట్ దొంగిలించి తింటూ రీల్స్ చేసిన హైదరాబాద్ యువకుడిపై పోలీసులు కేసులు నమోదు చేసారు.

హైదరాబాద్ : సోషల్ మీడియా పిచ్చితో సరదాగా చేసిన పని ఓ యువకుడిపై నేరస్తుడిగా ముద్రవేసింది. స్నేహితులతో కలిసి సరదాగా చాక్లెట్ తింటూ వీడియో తీసుకున్న యువకుడు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  అడ్డంగా బుక్కయ్యాడు. ఇలా చాక్లెట్ దొంగిలించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదుచేసిన ఘటన  హైదరాబాద్ లో వెలుగుచూసింది. 

వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ కు చెందిన హనుమంతనాయక్ ఇటీవల షేక్ పేటలోని డిమార్ట్ మార్ట్ కు వెళ్లాడు. స్నేహితులతో కలిసి సరదాగా డిమార్ట్ మొత్తం తిరిగిన అతడు సరదాకోసం చేయకూడని పని చేసాడు. డబ్బులు చెల్లించకుండానే అమ్మడానికి పెట్టిన చాక్లెట్లు తిన్నాడు. ఇలా దొంగతనంగా చాక్లెట్స్ తినడమే కాదు ఇదంతా స్నేహితులతో వీడియో తీయించుకున్నాడు. 

Latest Videos

ఇలా డీమార్ట్ లో చాక్లెట్ తిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు హనుమంతు నాయక్.  అంతటితో ఆగకుండా బిల్లు చెల్లించకుండానే చాక్లెట్ ఎలా తిన్నానో చూడండి అంటూ కామెంట్ చేసాడు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారి డిమార్ట్ సిబ్బంది దృష్టికి వెళ్లింది. ఇది చిన్నవిషయమే అయినా ఇతరులు కూడా ఇలాగే చేస్తే సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు వుండటంతో సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే షేక్ పేట డిమార్ట్ మేనేజర్ ఈ వ్యవహారంపై పోలీసులు ఫిర్యాదు చేసాడు. 

Also Read  కూల్ వెదర్ లో గరంగరం మిర్చీబజ్జి తింటే వుంటుందీ... కేటీఆర్ ఫీలింగ్ ఇదేనేమో

సోషల్ మీడియా వీడియో ఆధారంగా చాక్లెట్ దొంగిలించిన హనుమంతు నాయక్ ను గుర్తించారు పోలీసులు. అతడిపై 420, 379 తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. అతడికి సహకరించిన స్నేహితులపైనా పోలీసులు కేసు నమోదు చేసారు.  ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని ఫిలింనగర్ పోలీసులు తెలిపారు.


 

click me!