గుప్తనిధుల కోసం పిల్లి కళ్ల బాలుడి కిడ్నాప్ యత్నం: పోలీసుల అదుపులో ఒకరు

By narsimha lodeFirst Published Oct 16, 2023, 8:01 PM IST
Highlights

గుప్త నిధుల కోసం పిల్లి కళ్లున్న బాలుడిని కిడ్నాప్ చేసేందుకు  యత్నించిన ముఠాలో ఒకరిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపల్లి : గుప్త నిధుల కోసం ఓ పిల్లి కళ్లున్న బాలుని కిడ్నాప్ కోసం యత్నించిన ఘటన కలకలం సృష్టించింది. పిల్లి కళ్ళ బాలునితో గుప్తనిధుల కోసం పూజలు చేస్తే నిధుల ఆచూకీ దొరుకుతుందని  కిడ్నాప్ కోసం  చేసిన యత్నం విఫలమైంది. ఈ ఘటన  పెద్దపల్లి మండలం పాలితంలో చోటు చేసుకుంది.

పెద్దపల్లి మండలం పాలితం  గ్రామానికి చెందిన 15 సంవత్సరాల సాయి అనే  బాలుడిని కిడ్నాప్ చేసేందుకు  నలుగురు సభ్యుల ముఠా ప్రయత్నించింది. ఈ ముఠా సభ్యులు దొంగతుర్తి  గ్రామానికి చెందిన  ఓ వ్యక్తిని ఆశ్రయించారు.  పిల్లి కళ్ళ  బాలుని ఆచూకీ తెలుసుకొని  క్షుద్ర పూజలకు సహకరించాల్సిందిగా బాలుడి పేరేంట్స్ ను కోరారు. 

ఇందుకు బాలుని తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో కరీంనగర్ కు చెందిన ముగ్గురు ముఠా సభ్యులు ఆటోలో పాలితం గ్రామానికి వచ్చి పిల్లి కళ్ళ బాలుని కిడ్నాప్ కు యత్నించారు.

ఈ విషయాన్ని గ్రహించి ఎదురు తిరగడంతో ఆటోతో సహా నిందితులు పారిపోయారు. గ్రామస్తుల ద్వారా ఆలస్యంగా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ముఠా సభ్యులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు సభ్యుల కోసం గాలింపు చేపట్టారు.

click me!