
కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. చిన్న విషయంలో గొడవ జరిగినందుకు భార్యపై ఆగ్రహంతో ఊగిపోయాడు. భార్య ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ సంఘటన ఏటూరునాగారంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన గునిగంటి ప్రవీణ్ కుమార్ అదే మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమాన్ నగర్ గ్రామానికి చెందిన జ్యోతి, నర్సయ్యల కుమార్తె శిరీష(20)ను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. వీరికి నాలుగు నెలల బాబు కూడా ఉన్నాడు.
కాగా.. మంగళవారం సాయత్రం భార్యభర్తల మధ్య చిన్న గొడవ అయ్యింది. అంతే వెంటనే భార్య అనే కనికకరం లేకుండా.. పెట్రోల్ తీసుకొచ్చి భార్యపై పోశాడు. ఆ వెంటనే అగ్గిపెట్ట తెచ్చి అంటించాడు. దీంతో.. ఆమె ఒళ్లంతా కాలిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.
భార్య చనిపోయిందనే విషయం తెలియగానే.. ప్రవీణ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.